AP Monsoon: ఏపీకి చల్లటి కబురు. నైరుతి రుతుపవనాలు త్వరలో తాకనున్నాయి. కేరళకు ఇప్పటికే తాకాయి. క్రమేపి కర్ణాటకతోపాటు అరేబియా మహాసముద్రంలో విస్తరిస్తున్నాయి. అటు తర్వాత తమిళనాడు, ఏపీలో రాయలసీమకు సైతం విస్తరించనున్నాయి రుతుపవనాలు. జూన్ 1 నాటికి కేరళ తీరానికి రుతుపవనాలు తాకుతాయని అంచనా ఉండేది. కానీ రెండు రోజులు ఆలస్యం అయ్యింది. గురువారమే కేరళ తీరానికి తాకిన రుతుపవనాలు క్రమేపి విస్తరిస్తున్నాయి. అయితే పూర్తిస్థాయిలో విస్తరించి ఏపీలో సమృద్ధిగా వర్షాలు పడేందుకు మరో వారం రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే నైరుతి రుతుపవనాల ప్రభావంతో 90 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పడతాయి అన్న అంచనాలు ఉన్నాయి.
* కొనసాగుతున్న ఎండల తీవ్రత..
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకటే పరిస్థితి ఉంది. అయితే మధ్యలో ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో ఆకాశం మేఘావృతం అవుతోంది. వాతావరణం చల్లబడుతోంది. ఈరోజు ఉభయగోదావరి, పోలవరం, కాకినాడ తదితర జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షం పడే సూచనలు ఉన్నాయి. ఇంకోవైపు పోలవరం తో పాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉంది. రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో.. వర్షాల జాడ కూడా లేకుండా పోయింది. ఇప్పుడు రుతుపవనాలు ఏపీకి తాకనుండడంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
* ప్రమాద ఘంటికలు..
సాధారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. అయితే ఈ ఏడాది జూన్ మొదటి వారం దాటుతున్న రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు ఉండవని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తూ వస్తోంది. ఇంతవరకు ఏపీలో చాలా ప్రాంతాలకు చినుకు జాడలేదు. ఇటువంటి పరిస్థితుల్లో వర్షాలు లేకపోతే పంటలు పండే అవకాశం లేదు. దీనిని ముందుగానే గుర్తించిన ఏపీ వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేసింది. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు సూచిస్తోంది. కానీ ఈ నెల 15 నుంచి రుతుపవనాలు మరింతగా చురుగ్గా కదులుతాయని.. వర్షాలు సమృద్ధిగా పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
