Gen Z Politics RK Editorial: సమకాలీన రాజకీయాల మీద.. వర్తమాన అంశాల మీద ఆర్కే సార్ అలియాస్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ చేసే విశ్లేషణ ఒక యాంగిల్ లో బాగుంటుంది. మరొక యాంగిల్ లో విమర్శలకు కారణమవుతూ ఉంటుంది. ఆయన కూడా విమర్శిస్తుంటారు కాబట్టి.. ఆయన చేసే పనిని మనం కూడా విమర్శించవచ్చు. నిలదీసే స్వభావం లేకపోతే మనిషి చచ్చిపోయినట్టే రాధాకృష్ణ అంటారు. ఆయన అంటునట్టుగానే మనం కూడా ప్రశ్నిద్దాం.
జెన్ జెడ్ చూస్తోందని.. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు మారాలని.. కచ్చితంగా విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని సూచించారు. రాధాకృష్ణ యాంగిల్ లో ఇది కరెక్ట్. బంగ్లాదేశ్లో.. నేపాల్ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చిన విషయం కూడా కరెక్టే. కానీ బంగ్లాదేశ్లో ప్రభుత్వం ఏ స్థాయిలో ప్రజల కోసం పనిచేస్తుంది.. నేపాల్ లో అక్కడి ప్రధాని ఏ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.. పార్లమెంట్ సమావేశం జరుగుతుంటే మధ్యలో నుంచి వెళ్లిపోయారు.. ఇటువంటి జన్ జెడ్ నాయకత్వం ఏ మేరకు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతోంది..
యువతలో ఆవేశం ఉంటుంది కరెక్టే.. కానీ ఆవేశం ఆలోచనను తొక్కిపడేస్తుంది కదా.. తాత్కాలిక ఆగ్రహాలు వేరు.. శాశ్వత ఆలోచనలు వేరు. నరేంద్ర మోడీ యువతతో కనెక్ట్ అవుతున్నారు. అలాగని యువత మాత్రమే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకోవడం లేదు. ఈ దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడి ఉంది కాబట్టి.. యువత ఆకాంక్షలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం యువతరం ఆవేశంలోనే రాజకీయ పార్టీలు పాలిటిక్స్ చేస్తే.. మిగతా వర్గాల ప్రజలు ఏమైపోవాలి.. వారు ఎక్కడికి వెళ్లాలి..
ఏ ప్రభుత్వానికి అయినా సరే ప్రజలను పూర్తిగా సంతృప్తి పరిచే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో భిన్న వర్గాలు ఉంటారు . వారి ఆకాంక్షలు వేరే విధంగా ఉంది. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు మాత్రమే చేస్తాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న నాయకుల దగ్గర మంత్రదండాలు ఉండవు. ఇక ఈ తరం యువత విషయానికి వస్తే.. వారు సోషల్ మీడియా ద్వారా తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ప్రతిదీ కూడా క్షణాల్లోనే జరిగిపోవాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రాధాకృష్ణ లాంటి సీనియర్ జర్నలిస్టులు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.
ఆ యువత కూడా ఒక్క రోజులోనే యుక్త వయసుకు రాలేదు. అనేక పరిణామాలు.. అనేక దశలను దాటుకుని ఇక్కడ దాకా వచ్చారు. ప్రభుత్వంలో కావచ్చు.. పరిపాలన విధానంలో కావచ్చు లోపాలు ఉంటే ఉండవచ్చు. లోపాలు లేవని చెప్తే అది బూతు అవుతుంది. రాజకీయాలు కూడా పూర్తి వ్యాపారమయం గా మారిపోయాయి.. అందువల్లే ఎవరూ ప్రజలకు సేవ చేయాలని అనుకోవడం లేదు. ప్రజలు మాత్రం డబ్బులు స్వీకరించకుండానే ఓట్లు వేస్తున్నారా.. తమిళనాడు ఎన్నికల్లో కూడా డబ్బులు తీసుకొని ఓట్లు వేశారు. విజయ్ పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచక పోయి ఉండవచ్చు. కానీ అధికారాన్ని దక్కించుకునే క్రమంలో పుష్ప స్టైల్ లో సోఫాలు పంపిణీ చేసిన విషయాన్ని రాధాకృష్ణ మర్చిపోవద్దు.
కాక్రోచ్ పార్టీలు మఘ లో పుడతాయి.. పుబలో ముగిసిపోతాయి. ఈ దేశంలో అన్న హజారే కాంగ్రెస్ గవర్నమెంటు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. నాడు యువత కూడా ఆయనకు అండగా నిలిచింది. ఆ తర్వాత ఆ ఉద్యమం ఏమైపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగానే చెప్పినట్టు ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు.. ఆలోచనతో తీసుకునే విధానాలు వేరుగా ఉంటాయి. కేవలం యువత ఆవేశాన్ని పరిగణనలోకి తీసుకొని రాజకీయాలు చేయడం అంటే.. కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్టే ఉంటుంది. కాకపోతే రాధాకృష్ణ రాజకీయ పార్టీలకు తన తాజా సంపాదకీయం ద్వారా చురకలు అంటించారు. మొత్తంగా ఈ సంపాదకీయంలో జగన్ ప్రస్తావన రాలేదు. అదే ఆశ్చర్యకరం..
