Maacharla Politics : ఐదేళ్ల అరాచకమే ఆ పార్టీకి శాపం.. మాచర్లలో మారిన పొలిటికల్ సీన్!

వైసిపి అసలు సిసలు రాజకీయానికి పెట్టింది పేరు మాచర్ల. ఫ్యాక్షన్ సంస్కృతికి అద్దం పట్టింది. గత ఐదేళ్లుగా అరాచకం రాజ్యమేలింది. కానీ రాష్ట్రంలో అధికారం మారడంతో.. మాచర్లలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి.

Written By: Dharma, Updated On : August 16, 2024 12:51 pm

Changed political scene in Macherla!

Follow us on

Maacharla Politics : మాచర్లలో రాజకీయాలు ఎలా ఉంటాయో ఎన్నికల్లో అందరికీ అర్థమైంది. నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఈవీఎంలనే ధ్వంసం చేశారు సిటింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఎన్నికల సమయంలో మాచర్ల అంటేనే హడలెత్తిపోయింది రాష్ట్రం. అంతలా విధ్వంసాలు జరిగాయి అక్కడ. గడిచిన ఐదేళ్లలో అక్కడ ఎన్నికలు అనేవి జరిగేవి కాదు. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. దాదాపు అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వైసిపి పరమయ్యాయి. సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు.. ఇలా అన్నీ ఏకగ్రీవమే. ఎక్కడ కూడా పోటీ చేసేందుకు ప్రత్యర్థులు ముందుకు రాని పరిస్థితి. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే ఎలా ఉంటుందో.. బుద్దా వెంకన్న, బోండా ఉమా వాహనంపై దాడి తరహాలో ఉంటుంది వాతావరణం. అందుకే మాచర్లలో ఒక్క వైసీపీ తప్ప ఏ పార్టీ వాయిస్ వినిపించేది కాదు. కనీసం ఇతర పార్టీవారు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా పిన్నెల్లి ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్టు ఉండేది వ్యవహారం. అయితే ఇప్పుడు సీన్ మారింది. రాష్ట్రంలో అధికారం చేంజ్ కావడంతో వైసిపి పట్టు తప్పింది. టిడిపికి పట్టు చిక్కింది. అందుకే మున్సిపాలిటీల నుంచి మండల పరిషత్తుల వరకు అన్నీ టిడిపి వశం అవుతున్నాయి. ముఖ్యంగా మాచర్ల మున్సిపాలిటీలోని చైర్మన్ తో పాటు 31 మంది కౌన్సిలర్లు టిడిపి బాట పట్టడం విశేషం.

*:అప్పట్లో అన్ని స్థానాలు ఏకగ్రీవం
మునిసిపల్ ఎన్నికల్లో అప్పటి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 31 వార్డులకు గానూ.. అన్నింటినీ వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. మొదటి రెండు సంవత్సరాలు తురక కిషోర్ చైర్మన్ గా ఉండేవారు. బుద్దా వెంకన్న, బోండా ఉమా వాహనంపై దాడి చేసింది కిషోర్. ఇప్పుడు మరో వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చి.. కిషోర్ కు వేరే పదవి ఇచ్చారు. అయితే రాష్ట్రంలో వైసిపి ఓడిపోవడంతో ఏకగ్రీవమైన మున్సిపల్ కౌన్సిలర్లు అంతా టిడిపి బాట పట్టారు. చివరకు చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ సైతం టిడిపిలో చేరక తప్పని పరిస్థితి.

* జైల్లో పిన్నెల్లి
ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నారు. ఎప్పుడు విడుదలవుతారో తెలియని పరిస్థితి. ఒకవేళ బెయిల్ పై బయటకు వచ్చినా మాచర్లలో అడుగుపెట్టే పరిస్థితి లేదు. ఆయన సోదరుడు సైతం పరారీలో ఉన్నాడు. తురక కిషోర్ సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వీరే కాదు దాదాపు వైసీపీలో యాక్టివ్ గా ఉన్న నాయకులంతా సైలెంట్ అయ్యారు. అంతగా అరాచకం చూపని నేతలు ఇప్పుడు వేరే పార్టీలోకి వెళుతున్నారు.

* పూర్తిగా సీన్ మారింది
మాచర్లలో ఈ పరిస్థితిని చూస్తున్న స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది మాచర్లయేనా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మాచర్లను తమ సొంత జాగీరుగా మార్చుకున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పవర్ లేకపోవడంతో పూర్తిగా సీన్ మారింది. రాజకీయాన్ని రాజకీయంలాగే చేయాలి కానీ.. రౌడీయిజం చేస్తే అచ్చం మాచర్ల మాదిరిగానే ఉంటుందని సెటైర్లు వినిపిస్తున్నాయి.