AP Elections 2024: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇటువంటి సమయంలో సెలబ్రిటీల మద్దతు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. కొందరిని ప్రచార పర్వంలోకి లాగుతున్నారు. ఎన్డీఏ తరుపున పోటీ చేస్తారని భావించిన ప్రభాస్ కుటుంబ సభ్యులకు సీటు దక్కలేదు. దీంతో వారు వైసీపీలో చేరి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు పోలింగ్ కు ముందు ప్రభాస్ కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.
దివంగత కృష్ణంరాజు బిజెపిలో సుదీర్ఘకాలం పని చేశారు. కేంద్ర మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. గతంలో నరసాపురం పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక దశలో గవర్నర్ పదవికి కృష్ణంరాజు పేరు బలంగా వినిపించింది. చనిపోయే వరకు ఆయన బిజెపిలోనే కొనసాగారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. కానీ ఆ పార్టీలో చేరలేదు. అయితే కృష్ణంరాజు మరణం సమయంలో వైసీపీ రియాక్ట్ అయ్యింది. అంత్యక్రియలతో పాటు సంతాప సభల విషయంలో అతిగా స్పందించింది. దీంతో కృష్ణంరాజు కుటుంబం వైసీపీలో చేరుతుందని అంతా భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. ఇప్పుడు కృష్ణంరాజు కుటుంబం ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తుండటం విశేషం.
నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి బిజెపి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ బిజెపి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలతో పాటు కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. ఎంపీ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు.నిన్నటి వరకు వైసిపికి ప్రభాస్ అభిమానుల మద్దతు ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపడం, ప్రచారం చేయడంతో ప్రభాస్ అభిమానులకు కూడా స్పష్టమైన సంకేతాలు వచ్చినట్లు అయ్యింది.
గతంలో వారాహి సభల్లో సైతం ప్రభాస్ అభిమానుల విషయంలో పవన్ ప్రత్యేకంగా స్పందించారు. ప్రభాస్ అభిమానులు సైతం జనసేనకు అండగా నిలవాలని కోరారు. గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ తో సమానంగా ప్రభాస్ కు అభిమానులు ఉంటారు. అందుకే నాడు పవన్ ప్రభాస్ అభిమానులకు ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. అయితే ఇప్పుడు ప్రభాస్ కుటుంబ సభ్యులు నేరుగా రంగంలోకి దిగి ఎన్డీఏకు మద్దతు తెలపడం విశేషం. తప్పకుండా ప్రభాస్ అభిమానులు సైతం కూటమికే ఓటు వేస్తారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.