MP Avinash Reddy – YS Vijayalaxmi : అవినాష్ అరెస్ట్ ప్రచారం వేళ.. కర్నూలుకు వైఎస్ విజయలక్ష్మి

దీంతో ఆమెను పరామర్శించేందుకు విజయలక్ష్మి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అవినాష్ ను అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు అక్కడే ఉండి హైదరాబాద్ తిరుగుముఖం పట్టారు. 

Written By: Dharma, Updated On : May 22, 2023 6:41 pm
Follow us on

MP Avinash Reddy – YS Vijayalaxmi : వివేకా హత్యకేసుల్లో వరుస ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ఎపిసోడ్ కొనసాగుతోంది. ఆయన అరెస్ట్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ కు నిరాకరించిన వేళ.. రాష్ట్ర పెద్దలు ప్రధానమంత్రి కార్యాలయంతో చర్చలు జరుపుతున్నట్టు టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఏపీ సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తల్లి అనారోగ్య పరిస్థితి దృష్యా తాను సోమవారం నాడు విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాసిన తరువాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలోనే వైఎస్ కుటుంబంలో కలతలు రేగాయని ప్రచారం ఉంది. అటు తండ్రి మరణంపై పోరాడుతున్న సునీత వెనుక షర్మిళ ఉన్నారన్నటాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే దీనిపై చాలాసార్లు షర్మిళ కీలక వ్యాఖ్యలు చేశారు. సునీతకు మద్దతుగా .. అవినాష్ రెడ్డి శిబిరానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. అటు సునీత సైతం పలు సందర్భాల్లో షర్మిళను కలిశారు. అటు ఈ కేసు నుంచి బయటపడేయ్యాలని అవినాష్ రెడ్డి వైఎస్ విజయలక్ష్మిని కలిసి ప్రాధేయపడినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దాదాపు అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదన్న ప్రచారం వేళ ఆస్పత్రికి వెళ్లి విజయలక్ష్మి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

జగన్ అధికారంలోకి రాకముందు.. కుటుంబమే బలంగా ఉండేది.. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత కుటుంబమే బలహీనమవుతోంది. ఎందుకంటే గతంలో అక్రమ ఆస్తుల కేసులో 16 నెలలు హైదరాబాద్ లోని చెంచలగూడ జైలులో ఉన్న సమయంలో సీఎం జగన్ కు కుటుంబం అండగా నిలిచింది. జగన్ జైలులో ఉండగానే చెల్లి షర్మిళ జగనన్న వదిలిన భాణాన్ని అంటూ రాష్ట్రం అంతటా పాదయాత్ర చేసి వైసీపీని నిలబెట్టారు. నాడు ఎవరైతే జగన్ కు సహకరించారో నేడు వారే అడ్డంతిరిగారు. తెలంగాణ గవర్నమెంట్ షర్మిళను చాలారకాలుగా ఇబ్బందిపెట్టింది. ఆ సమయంలో విజయలక్ష్మి కుమార్తె కోసం రోడ్లపైకి వచ్చిన సందర్భాలున్నాయి. అయినా ఏనాడు జగన్ వారిని పరామర్శించిన  ఘటనలు లేవు.

అయితే జగన్ తమకు ప్రాధాన్యం ఇవ్వకున్నా వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం అటు విజయలక్ష్మి, షర్మిళ కలత చెందుతున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే భర్త భాస్కరరెడ్డి అరెస్ట్, కుమారుడు అవినాష్ రెడ్డి అరెస్టవుతారన్న ఆందోళనతో తల్లి లక్ష్మమ్మ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను పరామర్శించేందుకు విజయలక్ష్మి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అవినాష్ ను అడిగి తెలుసుకున్నారు. కొద్దిసేపు అక్కడే ఉండి హైదరాబాద్ తిరుగుముఖం పట్టారు.