Driver Subrahmanyam Case: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఆయనపై పోలీసుల అప్పట్లో కేసు నమోదు చేశారు. అరెస్టు కూడా జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఈ కేసు విచారణ నత్త నడకన సాగింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో కేసు వేగవంతంగా విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో అనంత బాబు సతీమణి లక్ష్మీ దుర్గ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఆమె నిందితురాలుగా చేర్చారు. మరోవైపు ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ తో పాటు కోర్టు విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో అజ్ఞాతం వీడిన ఆమె ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట విచారణకు హాజరైంది.
Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!
* ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ..
వైసిపి హయాంలో ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు ( MLC anantababu )వద్ద డ్రైవర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో అనంతబాబు అరెస్టయ్యారు. కూటమి అధికారంలోకి రావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను ప్రారంభించింది. అయితే ఈ హత్యలో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్ర కూడా ఉందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఆమెను ఎ2 నిందితురాలిగా చేర్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైకోర్టు ఆదేశాల మేరకు లక్ష్మీ దుర్గ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు హాజరయ్యారు. సిట్ ప్రధాన అధికారిగా ఉన్న ఎస్ డి పి ఓ మనీష్ పాటిల్ దేవరాజ్ కార్యాలయంలో ఆమెను విచారించారు. గత కొంతకాలంగా లక్ష్మీ దుర్గ అజ్ఞాతంలో గడుపుతూ వచ్చారు. ఆమెపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే దానిని కొట్టివేయాలని కోరుతూ లక్ష్మీ దుర్గ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఈనెల 16 నుంచి 30 వరకు సీట్ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈనెల 30 తరువాత రాజమండ్రి కోర్టు ముందు హాజరుకావాలని కూడా తీర్పు చెప్పింది. దీంతో ఆమె అజ్ఞాతం వీడి ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు.
* పక్కా ఆధారాలతో..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 2022 మే 19న సుబ్రహ్మణ్యం( Subramanyam ) హత్య జరిగింది. ఆ తరువాత తన కారులో అ మృతదేహాన్ని ఇంటికి పంపించారు అనంతబాబు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో లక్ష్మీ దుర్గ అక్కడే ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సుబ్రహ్మణ్యం హత్య జరిగిన తర్వాత భర్త అనంత బాబుతో కలిసి కారులో ఇంటికి రావడం సీసీ పూటేజీలో స్పష్టంగా రికార్డయింది. అయితే హత్య జరిగిన రోజు తాను స్థానికంగా లేనని.. బంధువులకు అస్వస్థతగా ఉండడంతో పరామర్శించేందుకు వెళ్లినట్లు ఆమె పోలీస్ విచారణలో తొలిసారి చెప్పింది. అయితే పోలీసులు పక్కా ఆధారాలు సేకరించడంతో ఇప్పుడు సరెండర్ కావాల్సిన అనివార్య పరిస్థితి. ఈ 15 రోజులపాటు ఆమె విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. చూడాలి ఫైనల్ గా ఏం జరుగుతుందో..