CM Jagan : ఏపీలో ఎవరి ధీమా వారిదే. గెలుపు పై అన్ని పార్టీలు ధీమాతో ఉన్నాయి. పోలింగ్ శాతం పెరగడంతోప్రభుత్వం పని అయిపోయిందని విపక్ష కూటమి భావిస్తోంది. అయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులు అయిన మహిళలు, పింఛన్ లబ్ధిదారులైన వృద్ధులు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంతో.. తమదే గెలుపు అన్న ధీమా వైసిపిలో కనిపిస్తోంది. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 81.86% ఓటింగ్ నమోదు అయ్యింది. పోలింగ్ వరకు నువ్వా నేనాఅన్నట్టు సమరం సాగింది. అందుకు తగ్గట్టుగానే ఓటింగ్ సైతం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి రావడంతో ఓటమికి అనుకూలమని ప్రచారం ప్రారంభమైంది. దీంతో జగన్ సైతం అలెర్ట్ అయ్యారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తూనే.. ఓటింగ్ సరళి పై సమీక్షించి ఒక స్పష్టతకు వచ్చారు.
ప్రభుత్వంపై వ్యతిరేకత, పెరిగిన పోలింగ్ వంటి అంశాలు పూర్తిగా తమకే అనుకూలిస్తాయని కూటమి అంచనా వేసింది. భారీ మెజారిటీ ఖాయమని లెక్కలు వేసింది. అయితే ఉదయానికే మహిళలు, వృద్ధులు ఓటు వేసేందుకు బారులు తీరడంతో వైసీపీలో ఆశలు చిగురించాయి. గత ఎన్నికల కంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదు కావడంతో అదంతా ప్రభుత్వ వ్యతిరేకత అని కూటమి అంచనా వేసింది. విశ్లేషణలు కూడా అలానే వచ్చాయి. దీనికి తోడు అర్ధరాత్రి వరకు 1500 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. ఎన్నికల సంఘం అధికారికంగా లెక్కలు వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలుపుకొని 82% ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించింది.
అయితే ఏపీలోని ప్రధాన నగరాల్లో ఓటింగ్ శాతం తగ్గడం, మహిళా ఓటింగ్ పెరగడంతో అధికార పార్టీ కొత్త అంచనాకు వచ్చింది. ఐప్యాక్ టీం, సోషల్ మీడియా విభాగంతో సీఎం జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పోలింగ్ సరళి పై చర్చించారు. నియోజకవర్గాల వారీగా నివేదికలతో విశ్లేషించారు. కోటి 69 లక్షల మంది మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారని.. వారితో పోల్చుకుంటే పురుష ఓట్లు ఐదు లక్షలు తగ్గాయని.. సంక్షేమ పథకాల ప్రధాన లబ్ధిదారులు మహిళలు కావడంతో.. వారు తప్పకుండా వైసీపీ వైపు మొగ్గు చూపుతారని జగన్ ఒక లెక్కకు వచ్చారు. టిడిపి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో సైతం మహిళలు ఎక్కువగా ఓట్లు వేశారని భావిస్తున్నారు. ఈ ధైర్యంతోనే జగన్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సాగిన పాలన.. మరింత మెరుగ్గా సాగుతుందని హామీ ఇచ్చారు.