CM Chandrababu : కేంద్రానికి టిడిపి మద్దతు ఉపసంహరణ.. రేపే మంత్రుల రాజీనామా.. దీనిపై చంద్రబాబు కీలక ప్రకటన

"చంద్రబాబు సంచలన నిర్ణయం. కేంద్రానికి టిడిపి మద్దతు ఉపసంహరించింది. ఆ పార్టీ మంత్రులు రేపే రాజీనామా చేస్తారు." ఇటీవల కాలం నుంచి ఈ తరహా మెసేజ్ లు, పోస్ట్ లు సామాజిక మాధ్యమాలలో ఎక్కువైపోయాయి. ఇది సహజంగానే అధికార తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దానికి తగ్గట్టుగా కౌంటర్లు ఇస్తున్నప్పటికీ ప్రజల్లో తప్పుడు సంకేతం వెళ్తోంది. దీంతో చంద్రబాబు స్పందించక తప్పలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : September 9, 2024 4:14 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu :  బుడమేరు ప్రవాహం వల్ల విజయవాడ వరదవాడగా మారిపోయింది. నగరంలోని మెజారిటీ ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ఆర్మీ సహకారంతో బుడమేరుకు ఏర్పడిన మూడు గంటలను యుద్ధ ప్రాతిపదికను పూడ్చారు.. తాత్కాలికంగా విజయవాడ నగరానికి బుడ మేరు వరద రాకుండా నిరోధించగలిగారు. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోటుపాట్లు తలెత్తితే వెంటనే సంబంధిత మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను ఉపేక్షించడం లేదు. అంతేకాదు ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటననూ చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు.. దీని వెనుక ఉన్న కారణాలను గుర్తిస్తామని ఇప్పటికే ఆయన ప్రకటించారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ బోట్లు ప్రతిపక్ష వైసిపికి చెందిన వారివిగా గుర్తించారని తెలుస్తోంది. అధికారులు ఆ దిశగా చంద్రబాబుకు నివేదిక ఇచ్చారని ప్రచారం జరుగుతోంది.. ఇక ఇదే సమయంలో కేంద్రానికి టిడిపి మద్దతు ఉపసంహరించిందని.. రేపే టిడిపి మంత్రులు రాజీనామా చేయబోతున్నారని వైసీపీ అనుకూల సోషల్ మీడియా విభాగం ప్రచారం చేస్తోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై కుట్రలు చేస్తే.. అస్థిరపరిచేందుకు కుయుక్తులు పన్నితే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. ” ఇలాంటి దిక్కుమాలిన పనులు గతంలో చూడలేదు. అడిగేవారు లేరని కొంతమంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆధారాలు లేకుండా పోస్టులు పెడుతున్నారు. ఒకవేళ మేము రాజీనామా చేయాలనే విషయం మీ అభిప్రాయమైతే.. దానిని మీ అభిప్రాయంగానే పోస్టింగ్ లాగా పెట్టుకోండి” అని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు మాట్లాడిన ఈ మాటలు సామాజిక మాధ్యమాలలో చర్చకు దారి తీస్తున్నాయి.

ఎండగట్టిన చంద్రబాబు

ఓవైపు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే.. వైసిపి చేస్తున్న ప్రచారాన్ని చంద్రబాబు ఎండగడుతున్నారు..” ఐదేళ్లు పరిపాలించి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష స్థానాన్ని కూడా దక్కించుకోలేక విషం చిమ్ముతున్నారు. ఇంతవరకు మీరు రూపాయి సహాయం చేయలేదు. ప్రజలను పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని మరింత నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. అందువల్లే ఇలా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొస్తాం. కచ్చితంగా మీ దురాఘతాలను ఎండగడతాం. రాష్ట్రంలో ఇలాంటి వారికి బహిష్కరణ తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భూతం పట్టి పీడిస్తోంది. దానిని భూమిలో పాతేయాలి. దానిపై కాంక్రీట్ వేయాలి. అలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు ఉంటాయని” చంద్రబాబు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి కొద్దిరోజులుగా వైసిపి అనుకూల సోషల్ మీడియా విభాగం ప్రచారం పెరిగిపోయింది. అది సహజంగానే టిడిపిని ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా వరదల సమయంలో చోటు చేసుకున్న సంఘటనలను ప్రధానంగా వైసిపి సోషల్ మీడియా విభాగం ఎత్తిచూపింది. ఇదే దశలో కేంద్రానికి టిడిపి మద్దతు ఉపసంహరించుకుందని వైసీపీ అనుకూల సోషల్ మీడియా ప్రచారం చేయడంతో చంద్రబాబు స్పందించాల్సి వచ్చింది. మరి దీనిపై వైసీపీ సోషల్ మీడియా ఎలా ప్రతిస్పందిస్తుందో చూడాల్సి ఉంది.