CI Nagaraju: వైసిపి స్టాండ్ మార్చుకుంది. పార్టీ హై కమాండ్ ఎలా చెబితే అలా నడుచుకోవాలి కాబట్టి.. నేతలు కూడా అదేదారిలో వెళ్తున్నారు.. ఇంతకీ వైసీపీ స్టాండ్ మారింది ప్రజల విషయంలో కాదు.. కుల రాజకీయాలలో.. కులాల కుంపట్లు రగిలించడంలో అనే టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. అంతేకాదు తెరపైకి ఒక సంచలన విషయాన్ని వారు బయటకు తీసుకొచ్చారు.
ఇటీవల కృష్ణలంక కేసులో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో కేశినేని నాని చాలా క్లారిటీగా “కమాండ్ రెస్పాన్సిబిలిటీ” అనే పదాన్ని పేర్కొన్నారు.. దీని ప్రకారం సిఐ నాగరాజు మాత్రమే కాదు విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న రాజశేఖర్ బాబుని కూడా సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో రాజశేఖర్ బాబు పేరు ఎందుకు వచ్చింది.. ఆయనను ఎందుకు సస్పెండ్ చేయాలని నాని కోరుతున్నారో చాలామందికి అర్థం కాలేదు. దాని వెనుక అసలు కథ చాలా ఉంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం కుంభకోణం జరిగింది.. ఇందులో ముడుపుల వ్యవహారం కూడా ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఈడి అధికారులు అరెస్టులు జరుపుతున్నారు. ఈ కేసును విచారిస్తోంది కూడా విజయవాడ కమీషనర్ రాజశేఖర్ బాబు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి రాజశేఖర్ బాబు నాయకత్వం వహిస్తున్నారు.. ఈ కేసులో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని.. ఈ దోపిడి వ్యవహారాన్ని పూర్తిగా సాక్ష్యాలతో విచారణ చేస్తున్న నేపథ్యంలో.. అసలు పాత్రధారుడిని ఈడి ద్వారా అరెస్టు చేయించడానికి రంగం సిద్ధమవుతోంది.. ఇవి జరుగుతుండగానే సాయికృష్ణ కేసు తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ ఘటన జరిగి చాలా రోజులైంది.. ఇతడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కావడంతో వైసిపి నేతలు తెలివిగా స్కెచ్ వేశారు.. కులాల కుంపట్లు రగిలించడానికి సిద్ధమయ్యారు. కరపత్రంలో ఏకంగా కులాల పేర్లు ఉన్న ప్రస్తావిస్తూ ప్రజలలో లేని ఆగ్రహాలను తెప్పించడానికి సిద్ధమయ్యారు.
సాయి కృష్ణ కేసును అడ్డం పెట్టుకొని కమిషనర్ రాజశేఖర్ బాబు నిజాయితీని దెబ్బతీయడానికి వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.. అయితే వైసిపి నాయకులు చెప్పినట్టుగా సాయి కృష్ణ కుటుంబ సభ్యులు రాజశేఖర్ బాబు ప్రస్తావన తీసుకురాలేదని తెలుస్తోంది. విలేకరుల సమావేశంలో కూడా సాయి కృష్ణ తల్లి ఆ మాటలు చెప్పలేదు.. దీంతో వైసిపి ప్లాన్ బెడిసి కొట్టింది.. ఇప్పటికే నాగరాజును కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మీకు న్యాయం చేస్తామని స్వయంగా చంద్రబాబు సాయి కృష్ణ ఇంటికి వెళ్లి.. ఆమె తల్లికి మాట ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెబుతున్న కేశినేని అని మాత్రం రాజశేఖర్ బాబును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం.. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయడం.. దీనిని సమర్థిస్తూ వైసిపి నాయకులు హంగామా చేయడం.. చూడబోతే దాల్ మే కుచ్ కాలా హై అనే సామెతను గుర్తు చేస్తుందని టిడిపి నేతలు అంటున్నారు..
