Mega Star Chiranjeev : చిరంజీవిని వదలని కాంగ్రెస్.. పుట్టినరోజు నాడు షాక్

రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. అందుకే సినిమా రంగంలోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాను వద్దనుకున్నా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం మెగాస్టార్ ను విడిచిపెట్టడం లేదు.

Written By: Dharma, Updated On : August 22, 2024 2:53 pm

mega star chiranjeevi

Follow us on

Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను తెలుగు వాళ్ళు ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ, విదేశాల్లో సైతం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి సైతం కుటుంబ సభ్యులతో తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి షాక్ ఇచ్చింది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేశారు చిరంజీవి. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 18 స్థానాలకే పరిమితమయ్యారు. రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి.. ఒక స్థానంలో మాత్రమే గెలిచారు. తరువాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. రాజ్యసభ తో పాటు కేంద్ర మంత్రి పదవిని పొందారు. రాష్ట్ర విభజన వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. తరువాత యాక్టివ్ రాజకీయాల నుంచి దూరమయ్యారు. అలాగని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. ఆ పార్టీ తరఫున రాజ్యసభలో ఎంపీగా ఉంటూ పదవీ విరమణ చేశారు. తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో తిరిగిసినీ రంగంలో ఎంట్రీ ఇచ్చారు.ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.

* బిజెపి ప్రయత్నించినా
సినీ రంగం నుంచి చిరంజీవిని రాజకీయాల్లోకి తేవాలని బిజెపి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని.. మరోసారి ఆ తప్పు చేయనని.. మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చాలా సందర్భాల్లో చిరంజీవి సంకేతం ఇచ్చారు. మొన్నటికి మొన్న జనసేన అధినేత పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తారని టాక్ నడిచింది. అయితే పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇవ్వాలని మాత్రమే చిరంజీవి తన అభిమానులను కోరారు. ఎటువంటి ప్రచారం కూడా చేయలేదు.

* కాంగ్రెస్ కు ఏనాడో దూరం
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమయ్యారు చిరంజీవి.ఎన్నడు పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ఆహ్వానం అందుతున్నా ముఖం చాటేస్తూ వచ్చారు. ప్రధాని మోదీ తో మాత్రం సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ప్రధాని సైతం చిరంజీవికి ప్రత్యేకంగా ప్రాధాన్యమిస్తూ వచ్చారు. మొన్న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. సోదరుడు పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డారు. అంతకుమించి రాజకీయ కార్యకలాపాల్లో చిరంజీవి పాల్గొనడం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు చిరంజీవి.

* సభ్యత్వం రెన్యువల్
ఈరోజు చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. చిరంజీవి కాంగ్రెస్ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసింది. 2027 వరకు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని పొడిగిస్తూ ప్రకటించింది. దీనికి సంబంధించిన ఐడి కార్డును సైతం జారీ చేసింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీనిపై చిరంజీవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.