AP political mood : జగన్ పై ( Y S Jagan Mohan Reddy)జనాల వైఖరి మారుతోందా? ఆయనపై ప్రతికూలత తగ్గుతోందా? అది సానుకూలంగా మారితే కూటమికి కష్టమా? జగన్ ఇంకా మెరుగుపడాల్సి ఉందా? ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సి ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది. అయితే కేవలం అభివృద్ధి పైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజల్లో భిన్న స్పందన వస్తోంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అమలు చేసిన విషయాన్ని ఎక్కువ మంది గుర్తు చేసుకుంటున్నారు. దీంతో జగన్ పై ఒక రకమైన చిన్నపాటి సానుకూలత ప్రారంభమైంది. అయితే దానిని సద్వినియోగం చేసుకోవడం పై ఆధారపడి ఉంది జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు. సరైన ప్రణాళికతో ప్రజల్లోకి వెళితే.. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ప్రజలు జగన్ విషయంలో మరోసారి పునరాలోచించుకునే అవకాశం ఉంది. మరి జగన్ వైఖరి మార్చుకుంటారా? ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకుంటారా? అన్నది తెలియాల్సి ఉంది.
* జగన్ సంక్షేమాన్ని గుర్తుచేస్తూ..
2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. నవరత్నాలను( navaratnalu ) అమలు చేసి చూపించారు. కరోనా లాంటి విపత్తు సమయంలో సైతం సంక్షేమాన్ని అమలు చేసి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. అయితే ప్రజలు మాత్రం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కోరుకున్నారు. రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేసినా.. ప్రజలు మాత్రం సంతృప్తి చెందలేదు. అభివృద్ధి లేకపోవడాన్ని ఎక్కువమంది తప్పు పట్టారు. అయితే జగన్మోహన్ రెడ్డి విషయంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి. మద్యం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం అయింది. ఆపై భూ సర్వే, భూపత్రాలపై జగన్ ఫోటోలు వంటివి ప్రజల్లో అపనమ్మకాన్ని పెంచాయి. విపక్షాల ప్రచారాన్ని ప్రజలు ఎక్కువగా నమ్మారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది.
Also Read : ఆ రెండు జిల్లాల్లో కూటమి పరిస్థితి ఇలా.. సంచలన సర్వే
* అభివృద్ధిపై ఫోకస్..
అయితే కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పై దృష్టి పెట్టింది. ఐదేళ్ల వైసిపి హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను ప్రారంభించింది. ఆపై అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టింది. రాజ్యాంగబద్ధ నిధులు, విధులు విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కానీ సూపర్ సిక్స్ పథకాల అమలులో జాప్యం చేస్తూ వచ్చింది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ఎక్కువమంది గుర్తు చేసుకుంటున్నారు. సమయానికి అనుకూలంగా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరడంతో ఎక్కువమంది.. ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నారు. కూటమి సర్కార్ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తుండడంతో ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి అయితే ఉంది. అయితే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఎక్కువమంది ఆశిస్తున్నారు.
* ప్రజల మధ్యకు రావాల్సిందే..
జగన్మోహన్ రెడ్డి గత ఏడాది కాలంగా ప్రజల్లోకి వచ్చింది తక్కువ. పైగా ఆయనకు విలువైన సలహాదారులు కూడా తక్కువ అయ్యారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు అధికారపక్షం పై ఆయన దాడి చేయలేకపోతున్నారు. గతంలో తన విషయంలో కూటమి కార్నర్ చేసినట్టు.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పందించలేకపోతున్నారు. అది ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారుతోంది. ప్రజల మూడ్ మారినప్పుడే గుర్తించి..తదనుగుణంగా అడుగులు వేస్తే మాత్రం.. జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు. ఇక తేల్చుకోవాల్సింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీయ.