CM Chandrababu: టిడిపిలో( Telugu Desam Party) క్రమశిక్షణ కట్టు దాటుతోంది. చాలాసార్లు హెచ్చరించారు అధినేత చంద్రబాబు. కానీ కొంతమంది ఎమ్మెల్యేల తీరు మారకపోవడంతో ఇప్పుడు ఫైనల్ వార్నింగ్ అంటూ హెచ్చరిస్తున్నారు. తాజాగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎపిసోడ్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే లాస్ట్ చాన్స్ అని ఈసారి ఊరుకునేది లేదని హెచ్చరించారు. వ్యక్తిగత లాభాల కోసం పార్టీని, ప్రభుత్వాన్ని పణంగా పెట్టలేమని తేల్చి చెప్పారు. నేతలు గీత దాటితే సస్పెండ్ చేస్తామని తేల్చి చెప్పారు. ఇలానే వ్యవహరిస్తే సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా మారిపోతారని కూడా చంద్రబాబు వార్నింగ్ ఇవ్వడం విశేషం. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు అరవింద్ బాబు ఎపిసోడ్ తో దానిని బయటపెట్టారు.
Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..
* ఎస్పీ ఆఫీసులో హైడ్రామా..
ఇటీవల పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీసులో నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హంగామా చేశారు. దాదాపు పది గంటలపాటు అక్కడే బైఠాయించారు. పల్నాడు జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారు పదవి విషయంలో పట్టుబట్టారు. తాను సూచించిన వ్యక్తి పేరును ఎందుకు ఆమోదించలేదంటూ ప్రశ్నించారు. ఆఫ్టర్ కాఫీ కావాల్సిందేనని పట్టుబట్టి అక్కడే ఉండిపోయారు.. తాను ఎనిమిది నెలల కిందట న్యాయ సలహాదారు పదవి కోసం సిఫార్సు చేస్తూ ఎస్పీ కార్యాలయానికి లేఖ పంపిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకు ఎందుకు సంతకం చేయలేదని ప్రశ్నించారు. అయితే జిల్లా ఎస్పీ సముదాయించినా ఆయన వినలేదు. 10 గంటల పాటు అక్కడ హైడ్రామా నిలిచిన తర్వాత.. పైనుంచి వచ్చిన ఆదేశాలతో తన ఆందోళన విరమించారు. ఈ అంశంపై టిడిపి నాయకత్వం స్పందించింది. తక్షణం వివరణ తీసుకోవాలని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పళ్ళ శ్రీనివాసును సీఎం చంద్రబాబు ఆదేశించారు.
* లిఖితపూర్వక వివరణ..
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్( Palla Srinivas) నోటీస్ ఇవ్వడంతో ఆయన ముందుకు హాజరయ్యారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. ఎస్పీ ఆఫీస్ ఘటనపై లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించే ఉద్దేశం లేదని.. అనుకోకుండా జరిగిన పరిణామం అని చెప్పుకొచ్చారు. మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకుంటానన్నారు. అయితే మరోసారి ఇటువంటి ఘటన జరిగితే చర్యలు తప్పవని చంద్రబాబు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు పల్లా శ్రీనివాస్. అరవింద్ బాబు లిఖితపూర్వక వివరణ ఇచ్చిన తర్వాత దానిని నివేదించారు పల్లా శ్రీనివాస్ సీఎం చంద్రబాబుకు. ఈ సందర్భంగా చంద్రబాబు సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. పార్టీలో కొందరు నేతల తీరు సరిగా లేదని.. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే మరో ఆలోచనకు తావు లేకుండా సస్పెండ్ చేస్తామని కూడా హెచ్చరికలు జారీచేశారు. రాజకీయాల్లో క్రమశిక్షణతో సుదీర్ఘకాలం ఉండాలనుకుంటున్నారో.. లేకుంటే వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలి అనుకుంటున్నారో తేల్చుకోవాలని హెచ్చరించారు.
