Nara Lokesh Plan: ఏపీలో ( Andhra Pradesh) మరోసారి అధికారంలోకి వస్తామని భావిస్తోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అధికార కూటమికి గట్టి సవాల్ విసురుతూనే ఉంది. దానికి కారణం బలమైన జిల్లాలు ఆ పార్టీ నేతలకు పట్టుకొమ్మలుగా నిలుస్తూ వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో ఆ జిల్లాల్లో ఏకపక్షంగా సీట్లు గెలవడం ద్వారా అధికారంలోకి రావచ్చు అనేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అయితే దానికి విరుగుడు సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ కనిపెట్టారు. ఎక్కడెక్కడ అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉందో ఆ జిల్లాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఏదో దూకుడుగా రాజకీయాలు చేయడం కాదు.. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును అమాంతం పెంచాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. మొన్నటి టిడిపి కార్యవర్గాల ప్రకటన వెనుక ఈ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విజయనగరం లాంటి జిల్లాల విషయంలో చంద్రబాబు ఆలోచన ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. పక్కా ప్రణాళిక అన్నట్టు పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా విజయనగరం జిల్లాను గమనిస్తున్న లోకేష్ మార్కు కనిపిస్తోంది ఈ కూర్పులో.
* బొత్స కుల రాజకీయం..
కుల రాజకీయాలను అడ్డం పెట్టుకుని బొత్స రాణించారు విజయనగరం జిల్లాలో( Vijayanagaram district). కాంగ్రెస్ పార్టీతో పాటు వైసీపీలో తనకంటూ ఒక క్రియాశీలక పాత్ర పోషించి జిల్లాను శాసించారు. తన కుటుంబాన్ని మోహరించి జిల్లాను గుత్తాధిపత్యం లో ఉంచుకున్నారు. వ్యవస్థల్లో సైతం తన మనుషులను ఏర్పాటు చేసుకున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్న.. ఏ ప్రభుత్వం ఉన్నా తన మాట చెల్లుబాటు అయ్యేలా చేసుకున్నారు. అయితే దీనిని గ్రహించారు చంద్రబాబు. కానీ అశోక్ గజపతిరాజు లాంటి సౌమ్యుడుతో రాజకీయాలు చేసి బొత్సకు చెక్ పెట్టారు కానీ.. ఆయన మూలాలను దెబ్బతీయ లేక పోయారు. అయితే ఇప్పుడు అశోక్ గజపతి రాజును గవర్నర్ లాంటి రాజ్యాంగబద్ధ పదవిలోకి పంపించి.. ఆయనను ఎంతగానో గౌరవం ఇచ్చారు. కుమార్తె అదితి గజపతిరాజుకు ఎమ్మెల్యే పదవి ఇచ్చి రాజకీయ లోటును కూడా తీర్చారు. ఇప్పుడు బొత్స పై అసలు సిసలు రాజకీయం మొదలుపెట్టారు చంద్రబాబు, నారా లోకేష్.
* రాజ్యాంగ బద్ద పదవిలోకి అశోక్..
మొన్నటి ఎన్నికల్లో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు అశోక్ గజపతిరాజు( Ashok gajapathi Raju ). గత నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ జిల్లా బాధ్యతలను ఆయనే చూసేవారు. అయితే జిల్లా కోసం తన సొంత ఆస్తులను సైతం వదులుకున్నారు. అయినా సరే అక్కడ కుల సమీకరణలతో బొత్స తన ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. సంప్రదాయ రాజకీయాన్ని నమ్ముకున్న అశోక్ గజపతిరాజు అదే రీతిలో ముందుకు సాగారు. కానీ జిల్లాలో ప్రాబల్య సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స మాత్రం క్షేత్రస్థాయిలో తన పట్టును పెంచుకున్నారు. ఎప్పుడైతే అశోక్ గజపతిరాజు పక్కకు వెళ్లారో .. అప్పటినుంచి చంద్రబాబు మార్పు రాజకీయం ప్రారంభం అయింది. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్న కోణంలో బొత్సకు అదే సామాజిక వర్గంతో చెక్ పెట్టడం ప్రారంభించారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కార్యవర్గాలలో తూర్పు కాపుల ప్రాతినిధ్యం పెంచారు. బొత్సకు ధీటుగా ఒక సైన్యాన్ని తయారు చేసే పనిలో పడ్డారు.
* తొలుత నాగార్జునతో ప్రయోగం..
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యువనేత కిమిడి నాగార్జునను పిలిపించుకున్నారు చంద్రబాబు, లోకేష్. బొత్స హవా కు బ్రేక్ వేయాలంటే దూకుడుగా వ్యవహరించాల్సిందేనంటూ తేల్చి చెప్పారు. అది మొదలు నాగార్జున గట్టిగానే బొత్స అండ్ కోకు సమాధానాలు చెబుతున్నారు. మరోవైపు యువనేత కొండపల్లి శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చారు. మరింత దూకుడు పెంచాలని ఆదేశించారు. తాజాగా తెలుగుదేశంలో విధానపరమైన నిర్ణయాల్లో అత్యున్నతంగా భావించే పొలిట్ బ్యూరోలో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన గంటెడ శ్రీదేవికి చాన్స్ ఇచ్చారు. మరోవైపు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ను ప్రయోగిస్తున్నారు. కళా వెంకట్రావు సీనియర్ రెడ్డిని ఉపయోగించుకుంటున్నారు. ఆయన కుమారుడు రామ్ మల్లిక్ నాయుడును సైతం రంగంలోకి దించారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మాత్రం బొత్స ఫ్యామిలీకి దీటుగా ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నారు చంద్రబాబు, లోకేష్. అయితే వీరి ధాటికి బొత్స ఫ్యామిలీ తోక ముడియక తప్పదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..