Chandrababu Naidu MLA meetings: టిడిపి ఎమ్మెల్యేల పనితీరుపై ఫుల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న క్రమంలో ప్రజల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా ఇటీవల తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అందులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు ప్రచారం నడిచింది. అయితే పనితీరులో వెనుకబడిన ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతికూల అభిప్రాయాలు ప్రజల నుంచి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి.. ఈ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యేలను పిలిచి సీఎం చంద్రబాబు మాట్లాడతారని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం చంద్రబాబు.. కొన్ని కీలక సూచనలు చేశారు. మధ్యలో పలుమార్లు వారితో సమావేశమై వారి దృష్టికి చాలా విషయాలు తీసుకెళ్లారు. చాలామంది పనితీరు బాగాలేదని.. మార్చుకోవాలని సూచించారు. అయినా సరే పరిస్థితిలో పెద్దగా మార్పు రాకపోవడంతో సీఎం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.. ఐ విఆర్ఎస్ సర్వేలో వెనుకబడ్డ ఓ నలభై మంది ఎమ్మెల్యేలను పిలిచి మందలించాలని చూస్తున్నట్లు సమాచారం.
కొందరి వ్యవహార శైలితో..
2024 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. ఏకంగా 164 సీట్లతో గెలుపొందింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. తెలుగుదేశం పార్టీ సొంతంగానే 135 అసెంబ్లీ సీట్లను తెచ్చుకుంది. ప్రజలు ఎంతో నమ్మకంతో ఏకపక్ష విజయం అందించారు. అందుకే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి పాలన అందించాలని చంద్రబాబు సొంత పార్టీ ఎమ్మెల్యేలను సూచించారు. అయినా సరే ఏదో ఒక చోట.. ఎక్కడో ఒక ఎమ్మెల్యే ఇబ్బందులు తెచ్చి పెడుతూనే ఉన్నారు. చాలామంది ఎమ్మెల్యేలు అయితే పార్టీకి తలనొప్పిగా మారారు. అయితే సీఎం చంద్రబాబు ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలపై ఒక సర్వే చేయించారు. వారి పనితీరును అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. 90 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేకున్నా.. ఓ నలభై మంది ఎమ్మెల్యేలు మాత్రం ప్రజల్లో పలుచన అయ్యారు. వారి పనితీరు పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. అదే విషయం తేలడంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగనున్నారు.
నారా లోకేష్ సైతం..
ఇప్పటికే పార్టీ సీనియర్లతో పాటు ఎమ్మెల్యేలతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారితో డిన్నర్ చేస్తూ ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులను, పార్టీస్థితిగతులను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు సైతం సర్వేల్లో వెనుకబడ్డ ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాలని నిర్ణయించారు. ఈరోజు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. రేపు ఎల్లుండి సభకు సెలవు ఉండనుంది. 17వ తేదీన సభ మళ్లీ ప్రారంభం కానుంది. అయితే రోజుకు ఐదు నుంచి పదిమంది ఎమ్మెల్యేలకు పిలిచి చంద్రబాబు సమీక్షిస్తారని తెలుస్తోంది. సర్వేల్లో తేలిన అంశాలు, నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, మెగా వర్గాల నుంచి సేకరించిన సమాచారం వంటివి ఎమ్మెల్యేల ముందు ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తానికి అయితే చంద్రబాబు గట్టి ప్రణాళికతో ఉన్నారన్నమాట.