Chandrababu Biopic: తెలుగు రాజకీయ నేతల బయోపిక్ లు మంచి ఆదరణ పొందాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ) బయోపిక్ యాత్ర సినిమా ద్వారా తెరకెక్కించారు. విశేష ప్రేక్షకాదరణ పొందింది ఆ చిత్రం. ఎన్టీఆర్ కథానాయకుడు, నాయకుడు పేరిట బయోపిక్ వచ్చింది. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో మెప్పించారు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్ రానుంది. చంద్రబాబు జీవితంలోని ముఖ్యమైన సంఘటనల ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ మేరకు దర్శకుడు భానుశంకర్ ప్రకటన చేశారు. రాజధాని ఫైల్స్ చిత్రంతో అమరావతి రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకుడు భాను ప్రకాష్. ఆ చిత్రంతో బాగానే మెప్పించారు. ఇప్పుడు చంద్రబాబు బయోపిక్ తీయాలని నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా చంద్రబాబు రాజకీయ జీవితం అంటే చాలా రకాల పాత్రలు ఉంటాయి. దీంతో చంద్రబాబు పాత్ర ఎవరు పోషిస్తారు? మిగతా పాత్రధారులు ఎవరు? అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
* ఎలా చూపిస్తారు..
సామాన్యుడిగా జీవితం ప్రారంభించి.. విద్యార్థి సంఘ నేతగా ఎదిగి.. రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు( CM Chandrababu) రాణించిన తీరు భిన్నంగా ఉంటుంది. ఆయన ప్రతి అడుగు సవాళ్లతో కూడుకున్నదే. అయితే చంద్రబాబును సినిమాలో ఎలా చూపిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి. చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రతి ఘట్టంలో ఒక ఉద్వేగం, ఒక సంఘర్షణ దాగి ఉంది. దానిని బయోపిక్ లో చూపిస్తాను అంటున్నారు దర్శకుడు భాను ప్రకాష్.. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, నిర్మాణ సంస్థ వివరాలు, షూటింగ్ విశేషాలు, ఇతర సమాచారం త్వరలో వెల్లడిస్తానని చెబుతున్నారు భాను ప్రకాష్.
* పాత్రధారులు ఎవరు?
అయితే చంద్రబాబు పాత్రలో ఎవరు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎన్టీఆర్ బయోపిక్ లో చంద్రబాబు పాత్రధారిగా దగ్గుబాటి రానా నటించారు. అయితే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమాల్లో చంద్రబాబు పాత్రధారి బాగా ఆకట్టుకున్నారు. ఆయన అయితే అచ్చం గుద్దినట్టు సరిపోతారు అనేది ఒక అంచనా. మరోవైపు ఇతర నేతలు, ముఖ్యుల పాత్రల కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ప్రశ్న. చిన్న స్థాయి నుంచి ప్రారంభమైన చంద్రబాబు ప్రయాణం.. క్రమంగా రాజకీయాల్లో ఎదుగుతూ రాష్ట్ర నాయకుడిగా మారిన తీరు ఈ సినిమా ఇతివృత్తం. ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఎదుర్కొన్న సవాళ్లు, ప్రజల కోసం చేసిన పనులు వంటి వాటిని ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారట. ముఖ్యమంత్రిగా సాధించిన మైలురాళ్లు, ప్రతిపక్ష నేతగా చేసిన యాత్రలు, నందమూరి కుటుంబంతో ఉన్న అనుబంధం, అలిపిరిలో చంద్రబాబుపై జరిగిన దాడి, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరెస్టు.. ఇలా అన్ని ఎపిసోడ్లు ఉండనున్నాయని తెలుస్తోంది.