AP Local Body Elections: ఏపీలో ఒక రకమైన అనుమానం ఉండేది. కూటమి ప్రభుత్వం ఎన్నాళ్లు నడుస్తుందో చెప్పలేం అన్నవారు ఎక్కువగా ఉండేవారు ఎన్నికల సమయంలో. ఎందుకంటే చాలా రాజకీయ పార్టీల మధ్య పొత్తు కొద్ది రోజులకే విచ్ఛిన్నం అవుతూ వచ్చింది. అలాగే ఏపీలో కూటమిలోని టిడిపి, జనసేన మధ్య విభేదాలు వస్తాయని ఎక్కువ మంది ఆశించారు. కానీ వారి ఆశలు తీరలేదు. గత రెండేళ్లుగా రెండు పార్టీల మధ్య బంధం పెరుగుతుందే తప్ప తగ్గేదిగా కనిపించడం లేదు. అయితే క్షేత్రస్థాయిలో క్యాడర్ మధ్య మాత్రం విభేదాలు ఉన్నాయి. ఆ విషయం ఇరుపార్టీల అధినేతలకు తెలుసు. అయితే విభేదాలు ఎంత ఉన్నాయో అంతకుమించి ప్రచారం చేస్తోంది వైసీపీ సోషల్ మీడియా. ఏదైనా పరిణామం జరిగితే చాలు సోషల్ మీడియాను నింపేస్తోంది. కానీ వారి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా సజావుగా కొనసాగుతోంది పొత్తు. అయితే ఎంత పొత్తు ఉన్న ఓట్ల బదలాయింపు జరిగితేనే.. దానికి సరైన ఫలితం వస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇదే మాదిరిగా సత్ఫలితం చూసింది కూటమి. అయితే మరోసారి అటువంటి ఫలితాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో చూడాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు.
* ఉద్దేశపూర్వక జాప్యం..
ఏపీలో స్థానిక సంస్థలకు సంబంధించి పాలకవర్గాల గడువు ముగిసింది. ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. త్వరలో ఎన్నికలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. అయితే చంద్రబాబు జరుపుతున్న ఈ జాప్యం వెనుక చాలా రకాల వ్యూహాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా స్థానిక సంస్థల్లో సైతం కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరగాలన్నది చంద్రబాబు ప్రణాళిక. అందుకు ఆయన ఒక వ్యూహం రూపొందించారు. నియోజకవర్గ, మండల స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ నెల నాలుగున జరగనున్న ఎన్డీఏ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.
* సాఫీగా ఓట్ల బదలాయింపు కోసం
సార్వత్రిక ఎన్నికల వరకు పొత్తు ఓకే. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు అలా కాదు. అక్కడ స్థానిక పరిస్థితులు విపరీతంగా ప్రభావం చూపుతాయి. నేతలు ఆశావహులుగా ఉంటారు. ఈ క్రమంలో ఎన్నికలు నిర్వహిస్తే కూటమి నేతల మధ్య ఘర్షణతో పాటు వివాదాలు జరుగుతాయి. దీనిని ముందుగానే గ్రహించారు సీఎం చంద్రబాబు. అందుకే కూటమి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఏ మండలంలో ఎవరు జడ్పిటిసి గా పోటీ చేయాలి? సర్పంచ్ గా ఎవరికి అవకాశం కల్పించాలి? ఎంపీపీగా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి? ఆశావహుడు ఎప్పుడు నుంచి పనిచేస్తున్నారు? స్థానికంగా బలం ఎంత? ఇలా అన్ని వివరాలను ఆరా తీస్తుంది ఈ కమిటీ. ఒకవేళ బహుముఖ పోటీ ఉంటే సమన్వయం చేసుకొని ముందుకు సాగుతుంది. అప్పుడే ఓట్ల బదలాయింపు జరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఓటమి ఇచ్చేందుకు ఈ ప్రయత్నం గా తెలుస్తోంది. రేపు ఈ కమిటీల గురించి ప్రత్యేక ప్రకటన చేస్తారు సీఎం చంద్రబాబు.
