AP Cabinet: చంద్రబాబు మార్క్ క్యాబినెట్.. స్పీకర్ పదవి వారికే

మంత్రివర్గంలో బీసీ వర్గానికి చెందిన కింజరాపు అచ్చెనాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధితో సహా ఎనిమిది మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు.

Written By: Dharma, Updated On : June 12, 2024 10:39 am

AP Cabinet

Follow us on

AP Cabinet: మరికొద్ది గంటల్లో ఏపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటికే కొత్త మంత్రివర్గం ఖరారు అయ్యింది. అందరి అంచనాలకు భిన్నంగా చంద్రబాబు మంత్రివర్గ కూర్పును చేపట్టారు. చాలామంది సీనియర్లను పక్కన పెట్టారు. సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలతో పాటు బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చారు. సామాజిక సమీకరణల విషయంలో క్షత్రియ వర్గానికి ఛాన్స్ దక్కలేదు. దీంతో ఆ వర్గానికి స్పీకర్ పదవి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. మరో మంత్రి పదవి ఖాళీగా ఉంచడంతో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రివర్గంలో బీసీ వర్గానికి చెందిన కింజరాపు అచ్చెనాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధితో సహా ఎనిమిది మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, సవితా సహా కొత్తగా ఎన్నికైన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్యాబినెట్లో చోటు కల్పించారు. కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెరో నాలుగు పదవులు దక్కాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, పవన్, కందుల దుర్గేష్ లకు అవకాశం దక్కింది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి నారా లోకేష్, నాదేండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్ కు చాన్స్ ఇచ్చారు.

ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి సైతం అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ వర్గానికి చెందిన ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎం ప్రసాద్ రెడ్డికి అవకాశం కల్పించారు. ఎస్సీ కోటాలో వంగలపూడి అనిత, డోల బాల వీరాంజనేయ స్వామి, ఎస్టి కోటాలో గుమ్మడి సంధ్యారాణి, ముస్లింల నుంచి ఎన్ఎండి ఫరూక్, ఆర్యవైశ్య వర్గం నుంచి టీజీ భరత్ చోటు దక్కించుకున్నారు. అయితే దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ క్షత్రియ సామాజిక వర్గానికి అవకాశం దక్కలేదు. ఆ వర్గానికి చెందిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు, రఘురామ కృష్ణంరాజు.. ఇలా చాలామంది ఉన్నారు. అయితే రఘురామకృష్ణం రాజుకు స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఖాళీగా ఉంచిన ఒక మంత్రి పదవి చుట్టూ రకరకాల చర్చ నడుస్తోంది. స్పీకర్ పదవి కోసం రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల నుంచి కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు స్పీకర్ పదవిని గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఇస్తారని కూడా టాక్ నడుస్తోంది. అటు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం రేసులో ఉన్నట్లు సమాచారం. కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే కన్నా లక్ష్మీనారాయణకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఒకవేళ ఎస్సీల పేరు పరిశీలనకు వస్తే నక్క ఆనంద్ బాబుకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటికే రఘురామకృష్ణం రాజు తనకు స్పీకర్ పదవి చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. ఆయనకి ఇస్తారని ఒక బలమైన ప్రచారం మాత్రం నడుస్తోంది.