Chandrababu And Revanth Reddy: రాష్ట్ర విభజన ( state divide) జరిగి 11 సంవత్సరాలు అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు మూడు ప్రభుత్వాలు కొలువుదీరాయి. కానీ విభజన సమస్యలు మాత్రం ఇంతవరకు పరిష్కారం కాలేదు. కొన్ని రకాల కేటాయింపులు, సర్దుబాట్లు అస్సలు జరగలేదు. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల సీఎంలు త్వరలో సమావేశం కానున్నట్లు సమాచారం. విభజన సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఈ సమావేశం ఉండనుంది. ఇరు రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణం ఉంది. ఇటువంటి తరుణంలోనే సమస్యలను పరిష్కరించుకుంటే మేలని.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ సమావేశానికి సంబంధించి కీలక ప్రకటన రానుంది.
Also Read: కేసీఆర్ రాజకీయ గేమ్ప్లాన్.. అదను కోసం గులాబీ బాస్ ఎదురు చూపు!
* జూన్ లో తొలిసారిగా
ఏపీలో కూటమి( Alliance) గత ఏడాది జూన్ లో అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపట్టారు. అంతకుముందు 2023లో తెలంగాణ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడకు ఏడాది గడవకమునుపే ఏపీ సీఎం గా చంద్రబాబు పదవి చేపట్టారు. ఇరువురు నేతలు ఒకప్పటి సహచరులు కావడంతో రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి చర్చలు జరిపేందుకు రంగంలోకి దిగారు. గత ఏడాది జూలైలో తెలంగాణలోని ప్రజాభవన్ లో ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి సమావేశం అయ్యారు చంద్రబాబు, రేవంత్. అప్పట్లో విభజన సమస్యలకు సంబంధించి చాలా రకాల చర్చలు కొనసాగాయి. వాటి పురోగతి తెలుసుకునేందుకు తాజాగా మరోసారి సమావేశం కానున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
* 11 ఏళ్లుగా అవాంతరాలు..
వాస్తవానికి 2014లో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణకు సీఎంగా కేసీఆర్( KCR) పదవి చేపట్టారు. ఏపీ సీఎం గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అయితే రాజకీయంగా ఈ ఇద్దరు నేతలు విభేదించుకున్నారు. దీంతో అప్పట్లో విభజన సమస్యలు పెద్దగా పరిష్కారం కాలేదు. అటు తరువాత రెండోసారి తెలంగాణకు కెసిఆర్ సీఎం అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఇద్దరు నేతలు పరస్పరం సహకారం అందించుకున్నారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్ద పీఠవేశారన్న విమర్శ ఉంది. ఇలా పదేళ్లపాటు విభజన సమస్యల పరిష్కారానికి మార్గం దొరకలేదు. దీంతో దాని పర్యవసానాలు రెండు రాష్ట్రాలపై పడ్డాయి. ఇటువంటి తరుణంలో రెండు రాష్ట్రాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండడంతో విభజన సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
* చట్టబద్ధ పంపకాలపై దృష్టి..
త్వరలో రెండోసారి సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు( chief ministers ) సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. చట్ట ప్రకారం జరగాల్సిన పంపకాలు పూర్తి కాకపోవడంపై దృష్టి సారించారు. వీలైనంత త్వరగా వాటికి పరిష్కార మార్గం చూపాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. ముఖ్యమంత్రుల సామరస్య పూర్వక సమావేశం జరిగిన తర్వాత.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు రంగంలోకి దిగనున్నారు.