YS Jagan astrologer consultation: తమిళనాడులో విజయ్ గెలుపుతో సంబరాలు చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుని ప్రచారం చేయడం వల్ల అక్కడ విజయ్ అధికారంలోకి వచ్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే డ్రెస్ సెన్స్ విజయ్ ది అని మాజీ మంత్రి రోజా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక్క గెలుపు లోనే కాదు.. ఆ గెలుపు వెనుక ఉన్న వ్యూహాలను ఇప్పుడు ఏపీలో అమలు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్యుడు వల్ల.. ఆయన ఇచ్చిన సూచనలు పాటించడం వల్ల తక్కువ వ్యవధిలోనే అధికారంలోకి వచ్చారు అని జగన్మోహన్ రెడ్డికి తెలిసిందట. అందుకే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి జ్యోతిష్యుడిని రప్పించి తన భవిష్యత్తును తెలుసుకునే పనిలో ఉన్నారట జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి కి వచ్చిన ప్రముఖ జ్యోతిష్యుడు ఒకరు జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. తప్పకుండా అధికారం వరిస్తుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం.
విజయ్ గెలుపుతో..
విజయ్ గెలుపు వెనుక ఒక జ్యోతిష్యుడు ఉన్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో ప్రచారం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చండీగఢ్ నుంచి రుద్ర కరణ్ ప్రతాప్ అనే జ్యోతిష్యుని ప్రత్యేకంగా తాడేపల్లి కి పిలిపించుకొని పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆ జ్యోతిష్యుడు జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయాన్ని బయటపెట్టారు. ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తలను మరిచి.. జ్యోతిష్యులను జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నట్టు కనిపిస్తున్నారు ఈ వ్యవహారంతో. అయితే గతంలోనూ ఈ జ్యోతిష్యుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో.. కచ్చితంగా సీఎం అవుతారని.. అధికారంలోకి వస్తారని తేల్చి చెప్పారు. కానీ అది జరగలేదు. అయినా సరే ఇప్పుడు పిలిచారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
గతంలో ప్రత్యేకంగా..
గతంలో జగన్మోహన్ రెడ్డికి విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద పూజలు చేయించేవారు. అటు తరువాత చాలామంది జ్యోతిష్యులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా జ్యోతిష్యం చెప్పేవారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి తరచూ జగన్మోహన్ రెడ్డి కోసమే అన్నట్టు మాట్లాడేవారు. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమని తేల్చి చెప్పారు. దారుణ ఓటమికి గురికావడంతో ట్రోల్స్ కు గురయ్యారు. ఒకటి రెండుసార్లు వేణు స్వామి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో పాటే వాహనాల్లో ప్రయాణం చేశారు. అంతలా ప్రాధాన్యం ఉండేది జ్యోతిష్యులకు జగన్మోహన్ రెడ్డి హయాంలో. అయితే ఇప్పుడు ఏకంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి జ్యోతిష్యుని దించారు. గెలుపు అందుకోవాలని చూస్తున్నారు. అన్నింటికీ మించి తన వ్యక్తిగత కేసుల విషయంలో సైతం ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. అందుకు సంబంధించి దోష నివారణపై కూడా ఆయన నుంచి కొన్ని వివరాలు తెలుసుకున్నారట. మొత్తానికి అయితే పొలిటికల్ స్ట్రాటజిస్టులు పోయి ఆస్ట్రాలజిస్టులు వచ్చారన్నమాట.
