Central Cabinet Expansion: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీకి అనుకూల ఫలితాలు ఇవి. పశ్చిమ బెంగాల్( West Bengal ) చేజిక్కడం.. అస్సాంలో రెండోసారి అధికారంలోకి రావడం భారతీయ జనతా పార్టీ దూకుడు అప్రతిహాసంగా కొనసాగుతోంది. మరోవైపు పుదుచ్చేరిలో సైతం తిరిగి ఎన్ డి ఏ గెలుపొందడం ఆ పార్టీకి మరింత ఊపు తెచ్చింది. మరోవైపు కేరళలో మూడు అసెంబ్లీ స్థానాలతో ఉనికి చాటుకుంది. తమిళనాడులో ఆ పార్టీ గెలవకపోయినా అస్తవ్యస్త వాతావరణం తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో ఉంది బిజెపి. అయితే ఇదే ఊపుతో మిగతా రాష్ట్రాలపై దృష్టి పెట్టాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే 29 రాష్ట్రాలకు గాను.. 20 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. అందుకే మిగతా రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెడుతోంది. అందులో భాగంగా కేంద్ర క్యాబినెట్ విస్తరణ చేపట్టి.. అన్ని రాష్ట్రాలకు సమప్రా ధాన్యం ఇవ్వాలని చూస్తోంది. ఏపీ నుంచి ఇద్దరికీ మంత్రి పదవులు ఖాయమన్న టాక్ నడుస్తోంది.
* ప్రస్తుతం ముగ్గురు..
ప్రస్తుతం ఏపీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ముగ్గురు ఉన్నారు. క్యాబినెట్ హోదాలో కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. స్వతంత్ర హోదాలో గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. సహాయ మంత్రిగా బిజెపి ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ కొనసాగుతున్నారు. ఎన్డీఏకు 21 మంది ఎంపీలు ఉండగా.. అందులో ముగ్గురికి కేంద్ర మంత్రి పదవులు ఉన్నాయి.. ఇంకా 18 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఇప్పుడు రెండు మంత్రి పదవులు ఇస్తే ఏ పార్టీకి కేటాయిస్తారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే టిడిపి తో పాటు బిజెపికి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు లేనిది ఒక్క జనసేనకు మాత్రమే.
* జనసేనకు అవకాశం..
ఈసారి కచ్చితంగా కేంద్రమంత్రివర్గంలోకి జనసేన వెళ్లడం ఖాయమని తెలుస్తోంది. ప్రస్తుతం జనసేనకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కాకినాడ నుంచి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలసౌరి ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం సాగుతోంది. బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. గతంలో రెండు సార్లు ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఆయనకు తప్పకుండా కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కుతుంది అన్న టాక్ నడుస్తోంది. మరోసారి బిజెపికి ఛాన్స్ ఇస్తే మాత్రం దగ్గుబాటి పురందేశ్వరికి బెర్త్ లభించే అవకాశం ఉంది. సీఎం రమేష్ కూడా ఒక ఆశావహుడిగా ఉన్నారు. టిడిపికి ఇస్తే మాత్రం రాయలసీమ నుంచి.. రెడ్డి సామాజిక వర్గ పరంగా, మహిళా నేతపరంగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.