Botsa Satyanarayana: ఒకసారి నోరు జారాక వెనక్కి తీసుకోలేమంటారు. అది ఎవరికైనా.. ఎంతటి వారికైనా అసాధ్యమే. తాజాగా వైయస్ రాజశేఖర్ రెడ్డిని తలుచుకొని బోరున ఏడ్చారు బొత్స. అయితే అది మొదలు ఆయన సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. ఆయన పాత వీడియోలకు సంబంధించి.. జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్ ఫ్యామిలీ పై చేసిన కామెంట్స్ తో భారీ పోస్టులు వెలుస్తున్నాయి సోషల్ మీడియాలో. విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో బొత్స ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది. కానీ ఎందుకో ఆయన సైలెంట్ గా ఉండలేకపోతున్నారు. తాజాగా భోగాపురం ఎయిర్పోర్ట్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎయిర్పోర్ట్ విషయంలో ఆయన నోరు జారినట్టు కనిపిస్తున్నారు. చాలా తక్కువ చేసి మాట్లాడారు భోగాపురం విమానాశ్రయం గురించి..
* విభజన హామీల్లో భాగంగా..
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మంజూరు చేసింది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయం మంజూర అయింది. చంద్రబాబు ప్రభుత్వం విజయనగరం జిల్లా భోగాపురంను ఎంపిక చేసింది. స్థల సేకరణతో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ప్రారంభించింది. అయితే భోగాపురం ఎంపిక వెనుక అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఉన్నారు. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయం పనులు నత్తనడకన సాగాయి. మళ్లీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతం అయ్యాయి. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో పనులు దాదాపు పూర్తయ్యాయి. ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయ్యింది. జూలై నుంచి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
* భోగాపురం కంటే ఢిల్లీ వెళ్లి రావచ్చు..
అయితే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పై బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లాలంటే చాలా సమయం పడుతుందని.. ఇంతలో ఢిల్లీ ఎయిర్పోర్టుకు వెళ్లిపోవచ్చు అని ఆయన సెటైరికల్ గా మాట్లాడారు. విజయనగరం నుంచి 50 నిమిషాల్లో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకుంటామని.. అక్కడినుంచి గంటలో ఢిల్లీ వెళ్ళిపోతామని.. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ కు వెళ్లాలంటే గంటల సమయం పడుతుందని.. తన మనసులో ఉన్న కడుపు మంటను బయట పెట్టేశారు. కేవలం విజయనగరం నుంచి తనకోసమే ఎయిర్పోర్ట్ ఉందన్నట్టు ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజలకు పౌర విమానయాన శాఖ సేవల కోసం.. పెరుగుతున్న విశాఖ నగర అవసరాల దృష్ట్యా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. ఒకవైపు తమ హయాంలోనే విమానాశ్రయ నిర్మాణం జరిగిందని క్రెడిట్ చోరీకి ప్రయత్నిస్తూ.. ఇలా అదే ఎయిర్పోర్ట్ పై విషప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం బొత్స అడ్డంగా బుక్ అయినట్టు కనిపిస్తున్నారు.