Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో వేదిక పంచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో ఆగకుండా అధికార పార్టీలో ఉంటూ కాపు ఉద్యమం చేపడుతానని చెప్పడం కూడా రాజకీయంగా కూటమికి ఇబ్బందికరంగా మారింది. అయితే ఆయన ఏదో ఆశించి ఇలా చేస్తున్నారు అనేది ఒక వాదన. ఎందుకంటే పార్టీ పట్ల విధేయతతో మెలిగే వారు బోండా ఉమామహేశ్వరరావు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. అటువంటి నేత ఉన్నట్టుండి ఇలా చేయడం ఏమిటి అనే వాదన వినిపిస్తోంది. అందుకే దీనిపై టిడిపి హై కమాండ్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
* మంత్రి పదవి ఆశించి..
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు బోండా ఉమామహేశ్వరరావు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలకు ముందంజలో ఉండేవారు. సీనియర్ నేత కావడంతో.. రెండోసారి గెలవడంతో మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్నారు. కానీ రాజకీయ, సామాజిక కారణాల వల్ల ఆయనకు అవకాశం దక్కలేదు. పార్టీలో ఎంతోమంది సీనియర్లు పదవుల కోసం వేచి చూస్తున్నారు. కానీ బోండా ఉమా మాత్రం తనకు పదవి దక్కక పోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. అందుకే ప్రభుత్వం పట్ల ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్లు స్పష్టం అవుతోంది.
* సామాజిక వర్గ వ్యాఖ్యలు..
తాజాగా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు నేత అంబటి రాంబాబు తో కలిసి వేదిక పంచుకున్నారు. నిత్యం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తుంటారు అంబటి రాంబాబు. ఆయనతో సఖ్యత గా మాట్లాడడం పొత్తు ధర్మానికి, పార్టీ నైతికతకు భంగకరమనే భావన కూటమి పార్టీ శ్రేణుల్లో ఉంది. పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాపు ఉద్యమం చేపడుతామని బోండా ఉమా ప్రకటనలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన నిజంగా సామాజిక వర్గ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారా? లేకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పదవి పొందేందుకు ఇలా చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే దీనిని ఇలానే విడిచి పెడితే పార్టీలో క్రమశిక్షణ కట్టు దాటుతుంది అని టిడిపి హై కమాండ్ భావిస్తోంది. అందుకే ఆయనపై క్రమశిక్షణ చర్యలకు దిగాలని నిర్ణయించింది. అందుకే షోకాజ్ నోటీసులు జారీచేసింది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి శాతం ఉన్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు ఇబ్బందులు తెచ్చి పెడతాయని భావిస్తోంది. కేవలం అంబటి రాంబాబు తో వేదిక పంచుకోవడమే కాదు.. ముద్రగడ పద్మనాభం ను టిడిపి తక్కువగా అంచనా వేయడం వల్ల 2019లో ఓడిపోయిందని వ్యాఖ్యానించడం కూడా పార్టీ శ్రేణులకు నచ్చడం లేదు. లేని పోనీ వివాదాలను తెచ్చి పెడుతుండడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై బోండా ఉమామహేశ్వరరావు ఎలా స్పందిస్తారో చూడాలి.





