BJP Behind YCP: సింహం సింగిల్.. మాది ఎప్పుడు ఒంటరి పోరాటమే. కాంగ్రెస్ పార్టీ నే లెక్క చేయలేదు.. సోనియా గాంధీనే ఖాతరు చేయలేదు.. ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రకటన లేదు. పెద్ద పెద్ద డైలాగులు ఆ పార్టీ శ్రేణులకు వెన్నతో పెట్టిన విద్య. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా చెప్పుకుంటూనే.. కష్టం వస్తే బిజెపి సాయం తీసుకోవడం.. అదే బిజెపికి జాతీయస్థాయిలో మద్దతు తెలపడం ఇట్టే అర్థమవుతుంది. అయితే ఇదంతా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. వ్యక్తిగత కేసులతో పాటు రాజకీయ ప్రయోజనం కోసమే. అయితే ఇప్పుడు కూడా బిజెపి తమను కాపాడుతోందని బిల్డప్ ఇస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు.
* కేసుల కోసమే..
తాజాగా టీటీడీ లడ్డు వివాదానికి సంబంధించిన అంశాలతో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ లో. ఇప్పుడు కూడా బిజెపి తమ వెనుక ఉందని ప్రచారం చేసుకుంటున్నాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అయితే జగన్మోహన్ రెడ్డి పై ఉన్న పాత కేసులు, వివేకా హత్య నుంచి మొదలుకొని తాజా స్కామ్ ల వరకు దర్యాప్తు చూస్తే ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టు ఉంది. తమ వెనుక బిజెపి ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు అంటే రాజీ పడినట్టే కదా. అయితే బలమైన ప్రాంతీయ పార్టీ అని చెప్పుకునే వైయస్సార్ కాంగ్రెస్ లేనిపోని ప్రగల్బాలు పలకడం ఏమిటంటే.. పోనీ ఏదో రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నారు అంటే అది కాదు. కేవలం జైలు శిక్షలతో పాటు కేసుల కోసమే అన్నది బహిరంగ రహస్యం. విశ్వసనీయత అనే పెద్ద మాటలు వాడితే ఆ పార్టీకే నష్టం.
* ఎలాంటి అవకాశం లేదు..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాపాడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే సిద్ధాంత పరంగా కూడా ఆ రెండు పార్టీల భావజాలం వ్యతిరేకమే. ఎందుకంటే దళితులతో పాటు మైనారిటీ ఓటు బ్యాంకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఆ రెండు వర్గాలు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకమే. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే పని కాదు. గెలిచిన తర్వాత చట్టసభల్లో కేవలం మద్దతు మాత్రమే తెలుపుకోగలరు. అయితే ఏపీలో కూటమిలో ఉన్న బిజెపి మిగతా రెండు పార్టీలతో పోల్చుకుంటే తమను టార్గెట్ చేయడం లేదన్నది వైసీపీ మాట. అయితే ఏపీలో ఎలాగు పొత్తులో భాగంగా సీట్లతో పాటు ఓట్లు పెంచుకుంటుంది బిజెపి. కానీ వైసిపి చేస్తున్న ప్రచారానికి చెక్ చెప్పకుంటే మాత్రం బిజెపికే నష్టం. ఇప్పటికే వైసిపి తప్పులను ఎత్తిచూపుతోంది నేషనల్ మీడియా. మరోవైపు బిజెపి హిందుత్వవాదంతో బలంగా ముందుకు వెళుతుండగా.. ఆ వాదానికి తూట్లు పొడిచేలా వైసిపి ఏపీలో వ్యవహరించిందన్నది ప్రధాన ఆరోపణ. అటువంటి పార్టీతో అంటగాకడం నష్టమే. అయితే బిజెపిలో ఎటువంటి లోపం లేకపోయినా.. వైసిపి మాత్రం బిజెపి నీడలో ఉండాలని ప్రచారం చేసుకోవడం మాత్రం కాషాయ దళానికి నష్టం. తెలుసుకోకుంటే ఆ పార్టీకి ముప్పు.