Bhuma Family Politics: రాయలసీమ రాజకీయాల్లో భూమా కుటుంబానికి ప్రత్యేక స్థానం. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు తమదైన శైలిలో రాజకీయాలు చేశారు. తమ మార్కు పాలిటిక్స్ చూపించారు. కానీ ఆ దంపతుల అకాల మరణంతో పిల్లలు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ ఉన్నారు. మరోవైపు నంద్యాలలో బ్రహ్మానంద రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు. మరో కుమార్తె అలేఖ్య త్వరలో రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. అయితే పిల్లల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నంద్యాలలో భూమా కుటుంబం కాకుండా వేరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అక్కడ రాష్ట్ర మంత్రుల పర్యటనకు భూమా అఖిలప్రియ ను ఆహ్వానిస్తే… ఆమె గైర్ హాజరయ్యారు. దీంతో ఆ కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం మొదలైంది.
* టిడిపిలో సుదీర్ఘకాలం..
తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసింది భూమా కుటుంబం. భూమా నాగిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే ప్రజారాజ్యం ఆవిర్భావంతో భూమా నాగిరెడ్డి తన భార్య శోభ నాగిరెడ్డి తో కలిసి చిరంజీవి గూటికి చేరారు. అప్పట్లో రాయలసీమ లో చిరంజీవితో పాటు ఈ దంపతులిద్దరూ గెలిచారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ, నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి గెలిచారు. వైసీపీ నుంచి గెలిచిన ఈ ఇద్దరు తరవాత టిడిపిలోకి ఫిరాయించారు. అయితే నాగిరెడ్డి అకాల మరణంతో నంద్యాలకు ఉప ఎన్నిక జరిగింది. దీంతో కుమారుడు భూమ బ్రహ్మానంద రెడ్డి బరిలో దిగారు టిడిపి తరఫున. ఆ ఎన్నికల్లో బ్రహ్మానందరెడ్డి గెలిచారు. దీంతో అక్కతో పాటు తమ్ముడు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ సమయంలో అఖిలప్రియ మంత్రి కూడా అయ్యారు. కానీ 2019లో ఇద్దరు ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో కుటుంబానికి ఒక్కటే టికెట్ ఫార్ములాతో ఆళ్లగడ్డకు పరిమితం అయ్యారు అఖిలప్రియ. ఆళ్లగడ్డ నుంచి గెలిచిన అఖిల ప్రియ తరచు వివాదాస్పద అంశాల్లోకి చిక్కుకున్నారు.
* భవిష్యత్తు కోసం పోరాటం..
తాజాగా పిల్లలు ముగ్గురు మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల ప్రియ చాలా దూకుడుగా ఉంటారు. దూకుడు రాజకీయాలు చేస్తుంటారు. ఇంకోవైపు రెండో కుమార్తె అలేఖ్య మంచు మోహన్ బాబు కోడలు. మంచు మనోజ్ భార్య. త్వరలో ఆమె రాజకీయ ఎంట్రీ ఉంటుందని భర్త ప్రకటించారు. ఇప్పటికే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా ఉన్నారు. అయితే భవిష్యత్తు రాజకీయాల కోసం ఆ ముగ్గురు మధ్య పడడం లేదని తెలుస్తోంది. దీనిపై ఎప్పటికప్పుడు వారు జరుగుతున్న ప్రచారంపై ఖండిస్తూ వచ్చారు. అయితే నంద్యాలలో జరిగిన సమావేశానికి భూమా అఖిలప్రియ హాజరు కాకపోవడం వెనుక విభేదాలు ఉన్నట్లు ఇప్పుడు కొత్తగా ప్రచారం మొదలైంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

