Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మౌనం వీడారు. జనసేనలో చేరిన ఆయన తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఆయన మాత్రం జగన్మోహన్ రెడ్డి పై విరుచుకుపడుతూ అటువంటిదేమీ లేదని సంకేతాలు ఇచ్చారు. మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కీలక చర్చలు జరిపారు. తాను ఎటువంటి పదవులు ఆశించడం లేదని ప్రకటించారు. పదవులు ఆశించడానికి తాను ఎన్నికలకు ముందు రాలేదని.. తరువాత మాత్రమే వచ్చానని చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వపు ఆలోచనల వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. జగన్ వైఖరి వల్లే తన లాంటి వారు ఓడిపోయారు తప్ప వేరే కారణం లేదని కూడా తేల్చి చెప్పారు..
* వైఖరిలో మార్పు..
బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీరులో స్పష్టమైన మార్పు వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు బాలినేని. అయితే ఆయన పార్టీ మారినప్పుడు మళ్లీ వైసీపీలోకి వెళ్లిపోతారన్న అనుమానాలు అధికంగా ఉండేవి. కానీ ఆయన ఒక ప్రత్యేక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి నుంచి బయటకు వచ్చేసారు. అయితే బాలినేని పై ఉన్న అనుమానంతో కూటమి నుంచి పెద్ద సానుకూలత రాలేదు. జనసేనలో సైతం బాలినేని పై అనుమానపు చూపులు ఉండేవి. కేవలం రాజకీయ పబ్బం గడుపుకునేందుకు ఆయన జనసేనలో చేరారు అన్నది మెజారిటీ కూటమి శ్రేణుల అభిప్రాయం. కానీ జనసేనలోకి వచ్చిన ఏడాది తర్వాత కూడా బాలినేని వైఖరి మారలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఆయన విధానాలను తప్పుపడుతున్నారు.
* ఆరు జిల్లాల బాధ్యతలు..
బాలినేనికి రాయలసీమ బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. ఇటీవల కొంతమందితో స్థానిక సంస్థల కు సంబంధించి జన సైనికుల అభిప్రాయం తీసుకునే బాధ్యతను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పూర్తిగా రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లా బాధ్యతలను బాలినేని కి పవన్ ఇచ్చారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో వైసీపీలో ఇబ్బంది పడుతున్న నేతలు, కేడర్ను జనసేనలోకి రప్పించేందుకు ఇప్పటినుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతారని తెలుస్తోంది. మరోవైపు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. దర్శి నియోజకవర్గాన్ని బాలినేని కేటాయించేందుకు చంద్రబాబుతో పాటు పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు కూడా ప్రచారం నడుస్తోంది. అందుకే ఇప్పుడు బాలినేనికి కూటమిలో ప్రతి ఒక్కరు సహకరించే విధంగా.. ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తూ రాయలసీమ జనసేన బాధ్యతలు ఆయనకు అప్పగించినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.
