Balineni meets Chandrababu: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే ఆయన తాజాగా అమరావతిలో సీఎం చంద్రబాబుతో సమావేశం కావడం గమనార్హం. ఎందుకంటే రాజకీయంగా చంద్రబాబుకు బద్ధ విరోధిగా ఉండేవారు బాలినేని. వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సమీప బంధువు కావడంతో జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండేవారు బాలినేని. రాజకీయంగానే కాదు కుటుంబ పరంగా కూడా చూసుకుంటే చంద్రబాబుకు ఎప్పుడు వ్యతిరేకమే. అటువంటి చంద్రబాబుతో బాలినేని ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం జనసేన లో ఉన్నారు బాలినేని. ఏదో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే చంద్రబాబును కలిసి ఉంటారు.
కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా.. మంత్రిగా వ్యవహరించారు బాలినేని. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2004లో తొలిసారిగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో రెండోసారి గెలవడంతో రాజశేఖర్ రెడ్డి ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో మంత్రి పదవి వదులుకొని మరి బాలినేని జగన్ వెంటే అడుగులు వేశారు. 2014లో బాలినేని ఓడిపోయిన ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు జగన్. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి బాలినేని గెలవడంతో మంత్రిగా అవకాశం ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణలో బాలినేనిని తొలగించడంతో మనస్థాపానికి గురై జగన్మోహన్ రెడ్డికి క్రమేపి దూరమయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు.
దానిపై క్లారిటీ ఇచ్చేందుకే..
జనసేనలో చేరిన బాలినేనికి తగిన ప్రాధాన్యం లేకుండా పోయింది. పవన్ కళ్యాణ్ ఎంతగానో ప్రాధాన్యం ఇస్తున్న లోకల్ క్యాడర్ గుర్తించడం లేదు. ఆపై ఆయన చేరికను టిడిపి ఎమ్మెల్యే జనార్ధన కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒక రకమైన గందరగోళం నడుస్తున్న క్రమంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారన్న ప్రచారం నడిచింది. తనకు అటువంటి ఆలోచన లేదని.. ఈ ప్రచారం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని బాలినేని విమర్శించారు. ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనకు సానుకూల వాతావరణం ఏర్పడడంతో నేరుగా చంద్రబాబును కలిసి.. ఈ గందరగోళానికి చెక్ పెట్టాలని భావించినట్టు ఉన్నారు. అందుకే ఆయన చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే రాజకీయంగా బద్ధ విరోధిగా భావించే చంద్రబాబును బాలినేని కలవడం అంటే చిన్న విషయం కాదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరని ఈ ఘటనతో స్పష్టమవుతోంది.
