Ayyannapatrudu Chintakayala: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎంపిక చేస్తూ కూటమి నేతలు అసెంబ్లీ కార్యదర్శి కి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇతరులు ఎవరూ నామినేషన్లు వెయ్యకపోవడంతో అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఎన్నికయ్యారని అధికారులు ప్రకటించారు. ఈరోజు అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అయ్యన్నపాత్రుడు.ఆయనది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. ఈసారి క్యాబినెట్లో మంత్రి పదవి ఆశించారు. చంద్రబాబు మాత్రం స్పీకర్ గా ఎంపిక చేశారు.
ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లో ప్రవేశించారు అయ్యన్నపాత్రుడు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుడు. 1983 నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో పలుమార్లు మంత్రిగా వ్యవహరించారు. ఈసారి చంద్రబాబు ఆయన్ను క్యాబినెట్ లోకి తీసుకోలేదు. స్పీకర్ గా అవకాశం కల్పించారు. ఇవే తన చిట్ట చివరి ఎన్నికలని.. తనతో పాటు కుమారుడు విజయ్ కు అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని అయ్యన్న కోరారు. కానీ వివిధ సమీకరణలతో కేవలం అయ్యన్నపాత్రుడు కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు చంద్రబాబు. గెలిచిన తర్వాత మంత్రి పదవి ఆశించారు. ఉమ్మడి విశాఖలో రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అయ్యన్నకు ఈసారి ఛాన్స్ ఇవ్వలేదు. అనూహ్యంగా స్పీకర్ పదవికి ఎంపిక చేశారు.
సుదీర్ఘకాలం రాజకీయం చేసిన అయ్యన్నపాత్రుడు చేయని పదవి లేదు. 1985లో ఎన్టీఆర్ క్యాబినెట్లో తొలిసారిగా మంత్రి పదవి స్వీకరించారు. టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి క్యాబినెట్లో అయ్యన్నకు చోటు దక్కేది. 1996 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి ఎంపీగా కూడా గెలిచారు.అన్ని రకాల పదవులు చేశానని.. స్పీకర్ గా ఛాన్స్ దక్కడం ఆనందంగా ఉందని అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు. స్పీకర్ స్థానంలో కూర్చున్న తర్వాత పార్టీ గుర్తుకు రాకూడదని.. గౌరవ విపక్ష సభ్యులను కూడా అసెంబ్లీలో ప్రాధాన్యం ఇస్తానని అయ్యన్నపాత్రుడు చెబుతున్నారు. మొత్తానికి అయితే స్పీకర్ పదవితో అయ్యన్నపాత్రుడు యాక్టివ్ రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే ఆయన వారసుడు చింతకాయల విజయ్ చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఐ టీడీపీ బాధ్యతలు కూడా చూశారు.