Kartika month special: కార్తీక మాసం.. ఏడాదిలో ప్రత్యేకమైన నెల ఇది. నిత్య పూజలు జరుగుతుంటాయి ఈ నెలలో. పవిత్రమైన కార్తీక మాసం నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. భక్తులు ముఖ్యంగా శైవ క్షేత్రాలకు వెళ్తారు. ఏటా ఇలా వెళ్లే వారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ ఏడాది ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. 350 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. ఏయే క్షేత్రాలకు ఎన్ని బస్సులు? వాటి రూట్లు? అందుకు సంబంధించి షెడ్యూల్ ను ఆర్టీసీ అధికారులు తాజాగా ప్రకటించారు. నవంబర్ 2 నుంచి 30 వరకు కార్తీకమాసం కొనసాగనుంది. సాధారణంగా ఏటా కార్తీక మాసంలో భక్తులు పంచారామాలు, త్రిలింగ దర్శనాల ప్యాకేజీని ఉపయోగించుకుంటారు. ఈ ప్యాకేజీలతో పాటు వనభోజనాలు, ఆలయాల సందర్శన కోసం ఆర్టీసీ బస్సులను ప్రత్యేకంగా బుక్ చేసుకుంటారు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది అధికంగా బస్సులను కేటాయించేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. ఎందుకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీలను సైతం ప్రకటించింది.
* పంచారామాల ప్యాకేజీలో భాగంగా ఒకేరోజు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకునేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా యాగంటి, మహానంది, శ్రీశైలం ఆలయాలకు ఒకటిన్నర రోజులో వెళ్లి వచ్చేలా.. త్రిలింగ దర్శన ప్యాకేజీని సిద్ధం చేశారు. అలాగే అన్నవరం, శ్రీశైలం, కొండవీడు, కర్ణాటకలోని దేవనహళ్లి ఆలయాలను సందర్శించేందుకు వీలుగా బస్సులు నడుపుతున్నారు.
* ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఆర్టీసీ బస్సులను నడపడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఆధ్యాత్మిక పర్యాటక రంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందు లో భాగంగానే ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తేనుంది. అయితే ప్రతి డిపో పరిధిలో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ఆర్టీసీ. కార్తీక మాసంలో ఆలయాలు సందర్శించాలనుకున్నవారు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.