Andhra Pradesh Weather Update: ఏపీలో( Andhra Pradesh) భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మరోవైపు అకాల వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే అక్కడక్కడ పిడుగులతో కూడిన వాన పడుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మారిన వాతావరణం పరిస్థితుల నేపథ్యంలోనే ఇలా భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావం కారణంగానే వాతావరణం లో భిన్న పరిస్థితి. నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. గాలిలో తేమ పెరగడం, ద్రోణి ప్రభావంతో పిడుగులు పడే ముప్పు కూడా అధికంగా ఉందని చెబుతోంది విపత్తుల నిర్వహణ సంస్థ. అందుకే గ్రామీణ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కూడా అమాంతం పెరిగాయి. శనివారం పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా ఒంటిమిట్టలో( vontimitta ) 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. కర్నూలు జిల్లా గూడూరు, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.3 డిగ్రీలు, అనంతపురం జిల్లా తెరన్నపల్లి లో 44.1, తిరుపతి జిల్లా వరదయ్యపాలెం లో 43.5, మార్కాపురం జిల్లా కొమరోలులో 43 డిగ్రీలు, కాకినాడ జిల్లా కరప, శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువులో 42.9, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 42.5, పల్నాడు జిల్లా గురజాలలో 42.3, అన్నమయ్య జిల్లా నూలివీడులో 41.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా 244 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. మున్ముందు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వేడి గాలుల తీవ్రత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.
* విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు..
ఈరోజు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. అన్నింటికీ మించి మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని చెబుతోంది విపత్తుల నిర్వహణ సంస్థ. గ్రామీణ ప్రాంతాల వారికి కీలక సూచనలు జారీ చేసింది. ఉరుములు, పిడుగులు పడే సమయంలో రైతులు, పశువుల కాపరులు, కూలీలు పొలాల్లో ఉండకూడదని.. చెట్ల కింద నిలబడవద్దని కోరింది. పిడుగుల నుంచి రక్షణ పొందేందుకు సురక్షితమైన భవనాల్లో ఉండాలని సూచించింది. అకాల వర్షాలతో పంటలకు నష్టం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. మరో రెండు రోజులు ఈ భిన్న వాతావరణం కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.