Talliki Vandanam Scheme: ‘ఏపీలో తల్లికి వందనం పథకం అమలుపై ఫుల్ క్లారిటీ వచ్చింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ తల్లికి వందనం పథకం విషయంలో ప్రభుత్వం నుంచి ప్రకటన లేదు. ఈ క్రమంలో నిన్ననే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకం అమలుపై ఒక నిర్ణయం తీసుకున్నారు. జూలై 10న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేయనున్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు తెరుచుకున్నాయి. కానీ తల్లికి వందనం నిధుల విషయంలో మాత్రం ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది. గత ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభం లోనే ఈ నిధులు విడుదలయ్యాయి. ఈ ఏడాది మాత్రం విద్యా సంవత్సరం ప్రారంభంలో అందించలేకపోయింది ప్రభుత్వం. లబ్ధిదారులకు సంబంధించిన హౌస్ ఓల్డ్ సర్వేలో జాప్యం జరగడమే కారణం. విద్యాశాఖ నుంచి వెళ్లిన వివరాలు సచివాలయాల వారీగా మ్యాపింగ్ లో చూశారు. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు జూలై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించి.. అదేరోజు తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధుల జమ చేయనున్నారు.
* ఎంతమంది పిల్లలు ఉన్నా..
వైసీపీ హయాంలో అమ్మ ఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే అప్పట్లో ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే పరిమితం అయ్యేది సాయం. కానీ చంద్రబాబు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు గత ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద 13 వేల రూపాయల చొప్పున సాయం అందించారు. గత ఏడాది 67.27 లక్షల మందికి ఈ పథకం వర్తించింది. ఈ ఏడాది ఆ సంఖ్య 68 లక్షలు గా గుర్తించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించేందుకు సిద్ధపడుతున్నారు.
* సచివాలయాల్లో జాబితా..
ప్రస్తుతం లబ్ధిదారులకు సంబంధించిన సచివాలయాల హౌస్ హోల్డ్ సర్వే పూర్తయింది. ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖకు అందిస్తారు. అన్ని అర్హతలు ఉండి తుది జాబితాను తయారుచేసి సచివాలయాల వారిగా ప్రదర్శిస్తారు. మరోవైపు జూలై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తారు. అదేరోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. అర్హత ఉండి వివిధ కారణాలతో తల్లికి వందనం నిధులు జమ కాని వారి కోసం గ్రీవెన్స్ సెల్ కు అవకాశం ఇస్తారు. తప్పులు సరిదిద్దుకుంటే మళ్లీ నిధుల జమకు ఛాన్స్ ఉంటుంది. ఒకటో తరగతితో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సైతం నిధులు జమ చేయనున్నారు. మరోవైపు అనాధ పిల్లలకు సైతం తల్లికి వందనం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడం విశేషం.
