Talliki Vandanam Scheme: ఏపీలో తల్లికి వందనం పథకం విషయంలో బిగ్ అప్డేట్. విద్యార్థుల వివరాల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది రాష్ట్రవ్యాప్తంగా. విద్యాశాఖ అందించిన వివరాలతో సరిపోల్చుకుంటూ గ్రామ/ వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ వివరాల సేకరణ ముగించి తిరిగి విద్యాశాఖకు నివేదించాల్సి ఉంటుంది. కొన్ని రకాల సాంకేతిక సమస్యల దృష్ట్యా లబ్ధిదారులు నష్టపోకుండా ఉండేందుకు.. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ వెరిఫికేషన్ కొనసాగుతుండడం విశేషం. పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ 12న తల్లికి వందనం నిధులు జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
* ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో అమ్మ ఒడి పేరుతో పథకాన్ని అమలు చేసేవారు. అయితే ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించేది. అయితే తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15 వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు పథకాన్ని అమలు చేశారు. గత ఏడాది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద నిధులు జమ చేశారు. కానీ కొన్ని రకాల సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడంతో అప్పట్లో కొంతమందికి పథకం వర్తించలేదు. అయితే ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి వారందరి నుంచి ధ్రువపత్రాలు తీసుకుని తప్పులను సరిచేసి అందించారు. అయితే ఈసారి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు గాను ముందుగానే సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి సర్వే చేయిస్తున్నారు.
* వివరాల సేకరణ
ఏప్రిల్ 24 నుంచి విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 12న ఈ సెలవులు ముగియనున్నాయి. విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. ఇంకోవైపు జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు కూడా తెరుచుకొనున్నాయి. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తల్లికి వందనం నిధులు అందిస్తున్నారు. అయితే ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూసుకునే క్రమంలో భాగంగా.. సచివాలయ సిబ్బందితో వివరాల సేకరణ జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మరోవైపు ఈ పథకానికి అర్హత సాధించిన వారి వివరాల జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. ఈ కారణంతో నైనా తిరస్కరణకు గురైతే.. అందుకు సంబంధించిన కారణాలను కూడా వివరించనున్నారు. వాటిని సరిచేసే అవకాశం కూడా కల్పించనున్నారు.
