June 19 AP govt key implementations: ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ విద్య బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అవి సత్ఫలితాలు ఇచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల మాదిరిగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలుస్తున్నారు. అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య చదువుతున్న చిన్నారులను.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న వారి తల్లిదండ్రులను కలిసి.. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న ఉత్తమ విద్యా బోధన, సౌకర్యాల గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైన అవగాహన వచ్చి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు వస్తున్నారు. ఇదే స్ఫూర్తితో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మూడు కీలకమైన పథకాలకు శ్రీకారం చుట్టనుంది ఏపీ ప్రభుత్వం.
కొత్త విద్యా సంవత్సరంలో..
జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అక్కడకు వారం రోజులు అంటే.. జూన్ 19న 3 కీలకమైన అంశాలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరోజు తల్లికి వందనం కింద నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15 వేల చొప్పున నిధులు జమ చేయనుంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అందించేందుకు నిర్ణయించింది. గత ఏడాది 68 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నిధులు జమయ్యాయి. కానీ ఈసారి మాత్రం లబ్ధిదారుల సంఖ్య 70 లక్షలకు దాటనుందట. ఇప్పటికే తల్లికి వందనం లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు. సచివాలయాల వారీగా ఆ జాబితాలను ప్రదర్శించనున్నారు.
– అదే రోజు మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కూడా జరపనున్నారు. సాధారణంగా ఈ సంస్కృతి కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో కనిపిస్తుంది. కానీ తొలిసారిగా గత ఏడాది కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను నిర్వహించింది. ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
– ప్రభుత్వ పాఠ్యపుస్తకాలతో పాటు నోటుబుక్కులు అందించేందుకు నిర్ణయించింది. విద్యా కానుక కిట్ల పేరిట వీటిని అందించనున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో పాఠ్యపుస్తకాల పంపిణీ ప్రక్రియలో చాలా రకాలుగా జాప్యం జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందించి విద్యా బోధనకు ఎటువంటి అడ్డంకులు ఉండకుండా ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.