Rajya Sabha Elections: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్లో రాష్ట్రం నుంచి నలుగురు పదవీ విరమణ చేస్తారు. ఆ నాలుగు స్థానాలు కూటమి ఖాతాలో పడతాయి. ఎందుకంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కూటమికి ఏకపక్ష విజయం దక్కడంతో రాజ్యసభ పదవులన్నీ ఆ పార్టీకి దక్కుతాయి. ఒక్క రాజ్యసభ పదవులు మాత్రమే కాదు.. ఎమ్మెల్సీ పదవులు సైతం కూటమికే దక్కుతాయి. అయితే ఈసారి భారతీయ జనతా పార్టీకి ఛాన్స్ ఇవ్వకూడదని టిడిపి నేతలు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి రెండుసార్లు రాజ్యసభ పదవులను బిజెపికి కేటాయించారు. కేంద్రంలో అవసరాల దృష్ట్యా అలా తీర్చారు కానీ.. ఇప్పుడు రాజ్యసభలో బిజెపి బలం పెరిగింది. జూన్లో 70 స్థానాలు రాజ్యసభలో ఖాళీ అవుతాయి. అందులో సింహభాగం స్థానాలు బిజెపికి దక్కనున్నాయి. రాజ్యసభలో బిజెపి బలం పెరిగిన దృష్ట్యా ఏపీ నుంచి ఆ పార్టీకి అవకాశం ఇవ్వకూడదని టిడిపి నేతలు కోరుతున్నారు.
* నలుగురి పదవీ విరమణ..
ఏపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, అళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, సానా సతీష్ రాజ్యసభ సభ్యులుగా పదవీ విరమణ చేయనున్నారు. ఇందులో సతీష్ టీడీపీకి చెందిన నేత. ఏడాది కిందట రాజ్యసభ సభ్యుడిగా ప్రమోట్ అయ్యారు. దీంతో ఆయనకు రెన్యువల్ లభిస్తుంది. అయితే మిగతా మూడింటిలో ఒకటి జనసేనకు విడిచిపెట్టి.. రెండు రాజ్యసభ సీట్లు టిడిపి తీసుకోవాలని చూస్తోంది. కానీ బిజెపి కూడా ఆశిస్తోంది ఆ పదవిని. ప్రధానంగా తమిళనాడుకు చెందిన అన్నామలై పేరు వినిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం పోటీలో ఉన్నారు. అయితే మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వడాన్ని ఎక్కువమంది నేతలు తప్పుపడుతున్నారు. పైగా రెండుసార్లు బిజెపి రాజ్యసభ సీట్లు పొందింది. ఈసారి మాత్రం ఆ అవకాశం ఇవ్వకూడదు అని టిడిపి సీనియర్లు చంద్రబాబును కోరుతున్నారు. చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు.
* రాజ్యసభలో బిజెపికి మెజారిటీ..
ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చిన తరుణంలో రాజ్యసభలో బిజెపికి స్పష్టమైన మెజారిటీ లేదు. అందుకే గత రెండుసార్లు బిజెపి కోరిన వెంటనే చంద్రబాబు ఆ పార్టీకి రాజ్యసభ పదవులను సర్దుబాటు చేశారు. ఇప్పుడు రాజ్యసభలో బిజెపికి స్పష్టమైన బలం ఉంది. పైగా జూన్లో పదుల సంఖ్యలో బిజెపికి రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. బిజెపి ఏకపక్షంగా రాజ్యసభలో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. ఎన్డీఏ పరంగా బిల్లుల పాస్ కు అవసరమైన బలం ఎన్ డి ఏ సొంతమైంది. ఇటువంటి పరిస్థితుల్లో బిజెపికి మరో స్థానం ఇవ్వడం అంటే అది అతి అవుతుందని… అందుకే ఈసారి బిజెపికి ఎట్టి పరిస్థితుల్లో చాన్స్ ఇవ్వకూడదు అని చంద్రబాబుపై టిడిపి సీనియర్ నేతలు ఒత్తిడి పెంచుతున్నారు. ఆపై చాలామంది ఆశావహులు ముందుకు వచ్చి పదవి కోరుతున్నారు. దీంతో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవ్వక తప్పడం లేదు.