AP Housing Scheme: గృహ నిర్మాణానికి సంబంధించి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెద్ద ఎత్తున గృహాల ను పేదలకు కేటాయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద పెద్ద ఎత్తున ఇల్లు కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అర్హుల జాబితాను కూడా ఖరారు చేసింది. ఈ జాబితా ప్రకారం కేటాయింపులు కూడా చేయనుంది. జిల్లాల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది ప్రభుత్వం. అప్పట్లో పెద్ద ఎత్తున స్పందన లభించింది. ఇప్పుడు వాటికి కేటాయింపులు జరుపుతోంది.
* దరఖాస్తులకు విశేష స్పందన..
రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల వారిగా దరఖాస్తులను స్వీకరించింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల 42,000 దరఖాస్తులు వచ్చాయి.. వీటిని పరిశీలించిన అధికారులు తాజాగా 9.2 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. వీరిలో మళ్లీ రెండు కేటగిరీల వారు ఉన్నారు. తమకు అప్పటికే స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం సాయం కోరుతున్న వారు.. ఇంటి స్థలం కూడా లేకుండా ఇల్లు కావాలని కోరుతున్న వారు. అయితే స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం సాయం కోరుతున్న వారే అధికం. అటువంటివారు 7.18 లక్షల మంది ఉన్నారు. అలాగే ప్రభుత్వం ఇస్తానన్న మూడు సెంట్లు స్థలం కోసం ఎదురుచూస్తున్న వారు ఓ రెండు లక్షల మంది వరకు ఉంటారు. వీరి దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం అర్హులను ఖరారు చేసింది.
* ముందుగా లక్ష ఇళ్లు..
ఇప్పటికే రాష్ట్రానికి లక్ష ఇళ్లు వరకు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ అర్హుల జాబితాలో కొంతమందికి ముందుగా అవకాశం కల్పిస్తారు. ఒంటరి మహిళలు, ఆ తరువాత వితంతువులు, దివ్యాంగులకు కేటాయింపులు ఉంటాయి. రాష్ట్రంలో గృహ నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా వీలైనంత త్వరగా లబ్ధిదారులకు పెద్ద ఎత్తున గృహాలు మంజూరు చేయాలని చూస్తోంది. అయితే వైసిపి హయాంలో వివిధ పథకాల్లో భాగంగా మంజూరైన ఇళ్ల నిర్మాణంలో చాలా జాప్యం జరిగింది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేసి కొత్త లబ్ధిదారులకు ఇళ్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో పెద్ద ఎత్తున ఇళ్లు మంజూరు చేయాలని చూస్తోంది ప్రభుత్వం.
