Andhra Pradesh Housing Scheme: ఏపీకి గుడ్ న్యూస్ అందించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరోసారి పేదలకు ఇల్లు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రానికి కొత్తగా 12,370 ఇళ్లు మంజూరు చేయనుంది. తొలి విడతగా రూ.74.22 కోట్లు మంజూరు చేయనుంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల నిర్వహించిన సి ఎస్ ఎం సి సమావేశంలో కొత్త ఇళ్లు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. ఈ మంజూరైన ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా 119 పట్టణ స్థానిక సంస్థల్లో నిర్మించనున్నారు.
* త్వరగా నిర్మిస్తేనే..
అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏపీతోపాటు అన్ని రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఇళ్లను మంజూరు చేసింది. సెప్టెంబర్ 30లోగా ఆ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని.. ఒకవేళ చెయ్యకపోతే కేంద్రం నుంచి వచ్చే సాయం నిలిపి వేస్తామని హెచ్చరిస్తోంది. ఆ తరువాత ఖర్చులు రాష్ట్రాలు భరించాలని తేల్చి చెప్పింది. ఏపీకి కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం కింద.. గతంలో రూ.233.80 కోట్లు మంజూరు చేస్తే రూ. 41. 85 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగిలిన మొత్తాన్ని త్వరగా ఇళ్ల నిర్మాణం కోసం వెచ్చించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో 2026 మార్చి నాటికి 1,20,000 ఇళ్ల నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.. 45230 ఇళ్లకు మాత్రమే ప్రతిపాదనలు సమర్పించారు. రాష్ట్రానికి మంజూరైన ఇళ్లలో కేవలం 16,283 మాత్రమే మొదలయ్యాయి. రాష్ట్రంలో 45,230 ఇళ్లకు సంబంధించి నిధులు విడుదల అయ్యాయి. అందులో 12,776 మంది లబ్ధిదారులకు మాత్రమే వాటిని అందించగలిగారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి వచ్చిన సాయం, ట్రెజరీ లో ఉన్న రూ.121.71 కోట్లు కేంద్రం ఇచ్చిన నిధులపై కీలక ఆదేశాలు ఇచ్చారు. బి ఎల్ సి ఇల్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. ఈ ఇళ్లకు కేంద్రం నుంచి సాయం అందదు
* ఆసక్తి అంతంతే..
అర్బన్ పథకానికి సంబంధించి కేవలం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని లబ్ధిదారులు అర్హులు. అయితే ఇప్పటికే పట్టణ పేదలు చాలామంది గృహ నిర్మాణంలో భాగంగా లబ్ధిదారులుగా ఉన్నారు. అందుకే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎవరు ముందుకు రాని పరిస్థితి. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన తో పోల్చుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే గృహ నిర్మాణం సాయం ఎక్కువ. అందుకే లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అయితే అప్పట్లో మంజూరైన ఇళ్లకు సంబంధించిన నిర్మాణం చేపట్టకపోతే రద్దు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినా లబ్ధిదారుల నుంచి ఆశించిన స్థాయిలో ఆసక్తి కనిపించడం లేదు. అయితే ఇప్పుడు కొత్తగా భారీగా ఇల్లు మంజూరు అవుతున్న తరుణంలో.. పాత లక్ష్యాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
