Andhra Pradesh Panchayat Awards: ఏపీ ( Andhra Pradesh)మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. జాతీయస్థాయిలో మరోసారి మెరిసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ జాతీయ అవార్డుల్లో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ అగ్రస్థానంలో నిలిచింది. గతంలో 24వ స్థానంలో ఉండే ఏపీ.. ఇప్పుడు ప్రథమ స్థానానికి రావడం నిజంగా విశేషం. రెండున్నర సంవత్సరాలలోనే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం శుభపరిణామం. ఇదంతా పవన్ కళ్యాణ్ క్రెడిట్. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే ఈ విజయానికి పునాది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* గ్రామీణ శాఖలను తీసుకుని..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ పట్టుబట్టి తనకు గ్రామీణ, పంచాయతీరాజ్ శాఖలను దక్కించుకున్నారు. గ్రామీణ అభివృద్ధితో పాటు స్థానిక సంస్థల బలోపేతం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 13326 గ్రామపంచాయతీలు ఒకేరోజు గ్రామసభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రజాభాగస్వామ్యంతో సుమారు రూ.4500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు రూపకల్పన చేశారు. పారదర్శక విధానాలతో నిధుల దుర్వినియోగం తగ్గించి.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టారు. వేల కిలోమీటర్ల సిసి రహదారులు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థలతో రూపురేఖలను మార్చారు.
* జాతీయ స్థాయిలో సప్త..
పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విప్లవాత్మక మార్పులతో ఇప్పటికే పల్లెలు అన్ని విధాలా గుర్తింపు పొందాయి. పేదరిక నిర్మూలన- జీవనోపాధి మెరుగుదల విభాగంలో వైయస్సార్ కడప జిల్లాలోని చెమ్ముళ్లపల్లి దేశంలోనే రెండో స్థానాన్ని దక్కించుకుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గ్రామీణాభివృద్ధికి సంబంధించి వివిధ విభాగాల్లో ఏపీలోని చాలా గ్రామాలు ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. పంచాయితీరాజ్ శాఖకు చెందిన దాదాపు పదివేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఆ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. రాజాగా జాతీయస్థాయిలో దక్కిన ఈ గుర్తింపు పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే పల్లెల్లో నిజమైన స్వరాజ్యం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.