Deputy CM Pavan kalyan  : ఇంతలా మారిపోయావేంటి పవన్.. అప్పుడు అలా అన్నావ్..ఇప్పుడేం చేస్తున్నావ్?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గతంలో మాదిరిగా దూకుడుగా వ్యవహరించడం ఆయనకు కుదరడం లేదు.విపక్షంలో ఉన్నప్పుడు చాలా రకాలుగా మాట్లాడవచ్చు.కానీ అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.లేకుంటే ఇబ్బందులు తప్పవు.

Written By: Dharma, Updated On : August 23, 2024 11:49 am

Deputy CM Pawan Kalyan (1)

Follow us on

Deputy CM Pavan kalyan : విశాఖ ఫార్మా ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వైసీపీ శ్రేణులకు టార్గెట్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటనపై పవన్ కళ్యాణ్ మాటలను గుర్తు చేస్తున్నారు.నాడుస్థానిక ఎమ్మెల్యే,జిల్లా మంత్రి, రాష్ట్ర సీఎం.. ఇలా అందరి వైఫల్యాలను పవన్ ఎండగట్టారని..వారంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించారని.. పరిశ్రమల నిర్వహణలో డొల్లతనం బయటపడిందని.. చాలా రకాలుగా కామెంట్లు చేశారు. అయితే విపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన పవన్.. ఇప్పుడు ఎందుకు మెత్తబడ్డారని ప్రశ్నిస్తున్నారు. విశాఖలో ఫార్మా ఘటనపై పవన్ స్పందించిన తీరును తప్పు పట్టారు.తనకు పరిశ్రమల నిర్వహణపై మాట్లాడాలని ఉందని.. కానీ అలా మాట్లాడితే పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతాయన్న భయం కూడా ఉందని పవన్ వ్యాఖ్యానించడం విశేషం.దీంతో ఎల్జి పాలిమర్స్ఘటన సమయంలో పవన్ మాట్లాడిన తీరును.. తాజాగా మాట్లాడిన తీరును పోలుస్తూ వైసిపి సోషల్ మీడియా ఒక పోస్ట్ పెట్టింది.దానిని ఆ పార్టీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

* విపక్షంలో ఉన్నప్పుడు
విపక్షంలో ఉన్నప్పుడు పవన్ ప్రజా సమస్యలపై గట్టిగానే మాట్లాడేవారు. నాటి వైసిపి సర్కార్ను ఇరుకనపెట్టేలా వ్యవహరించేవారు. ప్రజాక్షేత్రంలో పదునైన మాటలతో ప్రశ్నల వర్షం కురిపించేవారు. అయితే ఇప్పుడు అలా మాట్లాడడం కుదరదు. అధికారంలో ఉన్నందున ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. గతం మాదిరిగా దూకుడుగా వ్యవహరిస్తామంటే కుదరని పని. అయితే ఇప్పుడు దానినే హైలెట్ చేస్తోంది వైసిపి. అప్పుడు తెరిచిన నోరు.. ఇప్పుడెందుకు తెరవదని ప్రశ్నిస్తోంది.

* అప్పట్లో గట్టిగానే వాయిస్
2020లో ఎల్జి పాలిమర్స్ ఘటన జరిగింది. అప్పట్లో 12 మంది కార్మికులు మృతి చెందారు. వెయ్యి మంది వరకు క్షతగాత్రులయ్యారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ గట్టిగానే స్పందించారు. పవన్ ప్రశ్నించడంతోనే అప్పటి యంత్రాంగం ఉరుకులు పరుగులు పెట్టింది. స్థానిక ఎమ్మెల్యే నుంచి రాష్ట్ర సీఎం వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. అందుకే ఈ వైఫల్యం అంటూ అప్పట్లో పవన్ గట్టిగానే నిలదీశారు. అయితే ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. తనలో ఉన్న నిస్సహాయతను బయటపెట్టారు. గట్టిగా మాట్లాడితే పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతాయి అన్న హెచ్చరికలతోనే తాను తగ్గినట్లు చెప్పుకొచ్చారు.

* జనసేన కౌంటర్ అటాక్
పవన్ కళ్యాణ్ పై వైసీపీ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే ఈ ఘటనపై జనసేన సైతం స్పందించింది. వైసిపి ప్రచారంపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతోంది. పవన్ కళ్యాణ్ అన్నదాంట్లో తప్పేంటని ప్రశ్నిస్తోంది. పరిశ్రమ నిర్వహణలో యాజమాన్యం వైఫల్యం గురించి కూడా పవన్ ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేస్తోంది. అప్పటి మాదిరిగానే పవన్ కళ్యాణ్ సైతం మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారని.. అనవసరంగా బురద జల్లి రాజకీయంగా చలిమంట కాచుకోవడానికి వైసిపి ప్రయత్నిస్తోందని.. జనసేన చెబుతోంది. పవన్ కళ్యాణ్ పై విమర్శలు మానుకోకుంటే.. మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తోంది. మొత్తానికైతే పవన్ ను వైసీపీ టార్గెట్ చేసుకోవడం విశేషం.