AP Coalition Government Achievements: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈనెల 12 నాటికి రెండేళ్ల పాలన పూర్తి కానుంది. మరోవైపు కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలన పుష్కరకాలం పూర్తిచేసుకోనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ ప్రగతి సభలు నిర్వహించాలని టిడిపి కూటమి నిర్ణయించింది. నిన్న చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించేందుకుగాను ఈ నెల 9 నుంచి 15 వరకు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రధానంగా మూడు ప్రాంతాల్లో మూడు సభలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ మూడు సభలను వేర్వేరు ధీమ్ లతో నిర్వహించాలని నిర్ణయించారు.. కేవలం పండుగలా కాకుండా తమ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేసింది… అనేది వివరించే ప్రయత్నం చేయనున్నారు.
* మూడు ప్రాంతాల్లో సభలు..
జూన్ 9న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాయలసీమ రీజియన్ లో నిర్వహించనున్న ఈ సభ ద్వారా.. సంక్షేమాలను వివరించనున్నారు. ఉచిత పథకాలతో పాటు సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ అమలు చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. జూన్ 12న అమరావతి ప్రాంతంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. సుపరిపాలనతోపాటు అమరావతి రాజధాని నిర్మాణంలో కూటమి ప్రభుత్వం అనుసరించిన వైఖరి గురించి వివరించనున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన అడ్డంకులను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి అన్నది ప్రధాన అజెండా. జూన్ 15న విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఐటీ సంస్థలు, తయారీ రంగ పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ప్రజలకు వివరిస్తారు.
* ఐక్యతను చాటే ప్రయత్నం..
అయితే ఈ భారీ బహిరంగ సభల ద్వారా కూటమిలో ఉన్న ఐక్యతను చాటాలని చూస్తున్నారు చంద్రబాబు. కూటమి విచ్చిన్నానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు వ్యతిరేక ప్రచారం కూడా చేస్తోంది. కానీ ఏది వర్కౌట్ కావడం లేదు. మూడు పార్టీల మధ్య గందరగోళానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. కానీ అవేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి భారీ బహిరంగ సభల ద్వారా తమ ఐక్యతతో విపక్షాలకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. అయితే మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభల ద్వారా గట్టిగానే చాటి చెప్పాలని చూస్తోంది.
