AP Assembly Budget Sessions: దమ్ముంటే సింగిల్ గా రండి.. విడివిడిగా పోటీ చేయండి.. ఇలా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ చేయని కామెంట్స్ అంటూ ఉండవు. కిందిస్థాయి నేత నుంచి అధినేత వరకు ఇదే మాట. అయితే ఒకే ఒక్క ఓటమి ఆ పార్టీని దారుణంగా దెబ్బతీసింది. ఆ పార్టీ అహంపై దెబ్బ కొట్టింది. ధైర్యం, దమ్ము కోసం నిత్యం మాట్లాడే ఆ పార్టీ 2024 ఎన్నికలతో దిగాలు పడిపోయింది. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు తొలిసారిగా సభకు వచ్చిన జగన్ తడబాటు చూస్తే ఇది అర్థమైంది. సభకు హాజరైతే తనకు ఎదురయ్యే పరిణామాలు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబుకు ఎదురైన పరిణామాలకు మించి తనకు ఇబ్బందులు తప్పవని గ్రహించారు జగన్. అందుకే నిబంధనలు ప్రకారం వీలుపడని ప్రతిపక్ష హోదా కోసం మాట్లాడుతూ శాసనసభకు రాకుండా గైర్హాజరవుతూ వచ్చారు. గత ఏడాది బడ్జెట్ సమావేశాలకు హాజరైన జగన్మోహన్ రెడ్డి అండ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. మళ్లీ ఈరోజు సభకు రావడం విశేషం. అయితే కేవలం 11 నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్ళిపోయారు.
* బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
ఈరోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు( AP assembly budget sessions ) ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగం కోసం అసెంబ్లీకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేవలం 11 నిమిషాల్లో సభ నుంచి వెళ్లిపోయారు. వచ్చి రాగానే రచ్చ మొదలుపెట్టారు. సభ్యులందరూ చూసే లోపే బయటకు వెళ్లిపోయారు. సభ ప్రారంభమయ్యే ఒక్క నిమిషం ముందు అంటే.. 9 గంటల 59 నిమిషాలకు సభలోకి వచ్చారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన తర్వాత గొంతుకు పని చెప్పారు. గవర్నర్ ప్రసంగాన్ని పదేపదే అడ్డు తగలడం మొదలుపెట్టారు. సరిగ్గా 10:10 గంటలకు బయటకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
* అనర్హత వేటు భయంతోనే..
అసెంబ్లీ నుంచి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేసరికి జగన్మోహన్ రెడ్డి వైఖరి పై ఇప్పుడు బలమైన చర్చ మొదలైంది. ఇంత మాత్రం దానికి వారు సభకు ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సభకు హాజరు కాకుంటే అనర్హత వేటు పడుతుందని భయపడి వచ్చినట్టు కనిపిస్తోంది. డిజిటల్ అటెండెన్స్ ఉండడంతో పది నిమిషాల పాటు కనిపిస్తే హాజరు ఇట్టే పడుతుందని భావించారు. ఆది నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలకు బలం చేకూరేలా వ్యవహరించారు. ధైర్యం, దమ్ము అన్న మాటలు పక్కకు వెళ్లిపోయాయి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి ధైర్యం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేవలం ఎమ్మెల్యే పదవులు కాపాడుకునేందుకు మాత్రమే సభకు హాజరైనట్లు స్పష్టమవుతోంది. సభకు వచ్చి ప్రజా సమస్యల ప్రస్తావన తీసుకొచ్చి.. ప్రభుత్వ తీరు నచ్చక వాకౌట్ చేసి ఉంటే బాగుండేది. ఇలా వచ్చి గవర్నర్ ప్రసంగంపై నిరసన తెలిపి బయటకు వెళ్లిపోవడం ఏమిటి అనే ప్రశ్న వినిపిస్తోంది.
* ప్రజల్లో విస్తృత చర్చ..
జగన్మోహన్ రెడ్డి వైఖరి పై ప్రజల్లో విస్తృత చర్చ మొదలయింది. ప్రజలు తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి.. నేనెందుకు ప్రజా సమస్యలు ప్రస్తావించాలి అన్నట్టు ఉంది ఆయన తీరు. ప్రతిపక్షం నిబంధనల ప్రకారం… రాజ్యాంగం ప్రకారం వైసీపీకి దక్కితే ఇప్పటికే ఆ పార్టీ న్యాయపోరాటం చేసేది. ప్రభుత్వం వద్దనుకున్నా ఆగేది కాదు. ఆయనకు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. అయినా సరే ప్రభుత్వం ఇవ్వాలని మొండికేసి అసెంబ్లీకి రావడం లేదు. అందుకే వైసిపి చెప్పే దమ్ము, ధైర్యం పై కూడా ప్రజల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది.
అమరావతి: ఏపీ అసెంబ్లీకి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. వైఎస్ జగన్తో పాటు అసెంబ్లీకి చేరుకున్న వైసీపీ ఎమ్మెల్యేలు#AP #APAssembly2026 #YSJagan #YCP
— NTV Breaking News (@NTVJustIn) February 11, 2026