16th Finance Commission Funds: ఏపీకి మరోసారి తీపి కబురు చెప్పింది కేంద్రం. స్థానిక సంస్థలకు భారీగా నిధులు కేటాయించింది. 16వ ఆర్థిక సంఘం నిధులు ఏకంగా రూ.16,627 కోట్లు కేటాయింపులు చేసింది. ఇందులో బేసిక్ గ్రాండ్ రూ.13,302 కోట్లు, పెర్ఫార్మెన్స్ గ్రాంట్ రూ.3,225 కోట్లు ఉన్నాయి. 2026 – 27 నుంచి ఐదేళ్లపాటు అంటే 2030-31 వరకు ఈ నిధులు విడుదల చేయనుంది. గత ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.12,800 కోట్లు కేటాయించగా.. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం లో అదనంగా రూ.3,827 కోట్లు కేటాయించింది.
* ఐదేళ్ల పాటు నిధులు..
ఐదేళ్లపాటు 16వ ఆర్థిక సంఘం కొనసాగనుంది. అయితే ఈసారి ఖర్చు విషయంలో కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. పైడ్ నిధుల నుంచి 50% గ్రామాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంలో ఘన వ్యర్ధాల నిర్వహణ కార్యక్రమాలకు ఖర్చు చేయాలని సూచించింది. 10% అన్ టైడ్ నిధుల నుంచి రోడ్ల నిర్మాణ పనులకు ఖర్చులు చేయాలని తెలిపింది. మిగిలిన నిధులను ఇతర అవసరాలకు కేటాయించాలని సూచించింది. ఇకనుంచి ఆర్థిక సంఘం నిధులను సిబ్బంది జీతభత్యాలకు వినియోగించకూడదు. కాగా ఈ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించి గ్రామపంచాయతీలకు 70%, జిల్లా పరిషత్తులకు 15%, మండల పరిషత్తులకు మిగిలిన 15% నిధులను కేటాయించనున్నారు.
* సరికొత్త మార్గదర్శకాలు…
ఈసారి ఆర్థిక సంఘం నిధుల విడుదల, వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను రూపొందించింది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఆన్లైన్లో బ్యాంకు ఖాతాలు అందుబాటులో ఉంచాలి. ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్ లో ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రణాళికలు అప్లోడ్ చేయాలి. నిధుల ఖర్చు వివరాలు కూడా తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే గత ఆర్థిక సంవత్సరం కంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల సాయం ఏపీకి అదనంగా అందుతుండడం మాత్రం శుభపరిణామం. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఏపీకి రూ.7700 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.

