AP Survey: ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంటు ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ ఆ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే ఒక దఫా అభ్యర్థులను ప్రకటించాయి.. అక్కడ అధికార పార్టీ సింగిల్ గా పోటీలోకి దిగుతున్నది. ప్రధాన ప్రతిపక్షాలు టిడిపి, జనసేన, బిజెపి కూటమిగా ఏర్పడి బరిలో ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ పోటీ రసవత్తరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే అభ్యర్థులు అక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు భారీ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికైతే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అయితే కొన్ని సంస్థలు సర్వే నిర్వహించి అడపా దడపా ఫలితాలు విడుదల చేస్తున్నాయి.. సరే ఇవి వాస్తవానికి దగ్గరగా ఉంటాయా?, దూరంగా ఉంటాయా? అనేది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలుస్తుంది.
రకరకాల ఫలితాలు
ముందుగానే చెప్పినట్టు ఇప్పటికి కొన్ని సర్వే సంస్థలు రకరకాల ఫలితాలు వెల్లడించాయి. కొన్ని సంస్థలు తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమికి అనుకూలంగా ఫలితాలు ఇస్తే.. మరికొన్ని సంస్థలు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. ఈ సర్వేలు ఇచ్చిన ఫలితాల ఆధారంగా రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక పోటీలో ఉన్న పార్టీలకు అనుకూల మీడియా సంస్థలు ఉండటంతో అవి ఊదర కొడుతున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కో తీరుగా సర్వే ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో వీటిని ఎంతవరకు నమ్మాలని? రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
టీఎన్- ఈటీజీ సర్వే ఏం చెప్పిందంటే..
తాజాగా టీఎన్- ఈటీజీ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ముఖ్యంగా ఏపీలో 25 పార్లమెంటు స్థానాల పరిధిలో కొద్ది రోజులుగా సర్వే నిర్వహిస్తోంది.. ఈ సందర్భంగా సంస్థ ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం అధికార వైసిపి 21 నుంచి 22 సీట్ల వరకు గెలుచుకుంటుందని ప్రకటించింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమి మూడు నుంచి నాలుగు పార్లమెంటు స్థానాలు దక్కించుకుంటుందని వివరించింది.. ఈ సంస్థ గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో ఫలితాలు ప్రకటించింది. దాదాపు అవి వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. ఇక ఇప్పుడు కూడా ఆ సంస్థ అలాంటి ఫలితాలనే ఇచ్చింది. ఈ ఫలితాలను వైసీపీ తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది. ఇది తమ జన రంజక పాలనకు ఉదాహరణ అని చెబుతోంది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా నేపథ్యంలో.. వైసిపి ఏకపక్షంగా అన్ని పార్లమెంటు స్థానాలు ఎలా గెలుచుకుంటుందని టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. రోజుకో పెయిడ్ సర్వే సంస్థ ద్వారా ఫలితాలు ప్రకటించి ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.