Andhra Pradesh SIR 2026: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ సోమవారం (జూన్ 15) నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించి జాబితాను నవీకరించేందుకు ఈ ప్రత్యేక సర్వే చేపడుతున్నారు. ఓటరు జాబితాలో పేర్లు సరైనవిగా ఉండటం, అర్హులైన ప్రతి పౌరుడు ఓటు హక్కు పొందడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఈ ప్రక్రియలో ఓటర్లు నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ పనిని తప్పనిసరిగా చేయాలి. అదేంటంటే?
SIR ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (BLOలు) సోమవారం నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారమ్లు అందజేస్తారు. ఓటర్లు తమ వ్యక్తిగత వివరాలు, చిరునామా, కుటుంబ సభ్యుల సమాచారం తదితర వివరాలను పరిశీలించి ఫారమ్లో సరిగ్గా నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరమైతే ఆధార్, వయస్సు, నివాస ధ్రువీకరణ వంటి పత్రాల వివరాలను కూడా జతచేయవచ్చు.
ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. జూలై 14లోపు నింపిన ఎన్యూమరేషన్ ఫారమ్లను సంబంధిత BLOలకు తిరిగి సమర్పించాలి. ఈ గడువులోగా ఫారమ్లు సమర్పించని వారి వివరాలను అధికారులు ధృవీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వారి పేర్లు తదుపరి దశలో పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంటుంది.
జూలై 21న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. ఎన్యూమరేషన్ ఫారమ్ సమర్పించని ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో లేకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫారమ్ను పూర్తి చేసి BLOలకు అందజేయాలని సూచిస్తున్నారు.
డ్రాఫ్ట్ జాబితా విడుదల అనంతరం అభ్యంతరాలు, సవరణలు, కొత్త పేర్ల నమోదు, తొలగింపులపై ప్రజలకు అవకాశం కల్పించనున్నారు. తుది పరిశీలన అనంతరం నవీకరించిన ఓటర్ జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు ప్రతి అర్హ ఓటరు ఈ ప్రత్యేక సర్వేలో పాల్గొని తమ వివరాలను సకాలంలో సమర్పించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

