Andhra Pradesh Weather Alert March: ఏపీలో( Andhra Pradesh) భానుడు ప్రతాపం చూపుతున్నాడు. సెగలు కక్కుతున్నాడు. మార్చి మొదటి వారంలోనే ఏకంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్నం నాటికి రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వేడి గాలులు వీయడంతో పాటు ఉక్కపోత అధికంగా ఉంది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది ప్రజలకు. అయితే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది కూడా. మార్చి మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయి అంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని అర్థమవుతోంది.
Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..
* రాయలసీమలో తీవ్రత..
ఎండల తీవ్రత సాధారణంగా రాయలసీమలోనే( Rayalaseema ) ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వేసవి ప్రారంభంలో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 38.5 డిగ్రీలు గా నమోదయింది. అమరావతి తో పాటు ఎన్టీఆర్, పల్నాడు, కడప, నంద్యాల, అనంతపురం జిల్లాలో అయితే ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు నమోదయ్యాయి. పశ్చిమగోదావరి తో పాటు కాకినాడ జిల్లాల్లో సైతం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రానున్న కొద్ది రోజుల్లో రాయలసీమలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
* ప్రభుత్వం అప్రమత్తం..
మార్చి రెండో వారం నుంచి ఉష్ణోగ్రతలు అమాంతం పెరుగుతాయని.. వేడి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రధానంగా శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఇక వడగాలులకు సంబంధించి కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండలకు సంబంధించిన సమాచారం అందించేందుకు రాష్ట్ర కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 అందుబాటులో ఉంచారు. ఇది 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. ఇకనుంచి ప్రజలకు ఫోన్ మెసేజ్ ల రూపంలో సైతం అప్రమత్తం చేస్తారు. మొత్తానికి అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని స్పష్టమవుతోంది.