Andhra Pradesh Gold Mine: అపారమైన సహజ వనరుల నిలయం ఏపీ. ఎన్నెన్నో వనరులు రాష్ట్రంలో ఉన్నాయి. బంగారం సైతం ఉన్నట్లు భూగర్భ గనుల శాఖ తేల్చింది. అందుకే రాష్ట్రంలో ప్రైవేటు భాగస్వామ్యంతో దేశీయ ఖనిజ రంగంలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు ఏపీ సిద్ధమైంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా భారీ తరహా ప్రైవేటు బంగారు గని ఏపీలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి వద్ద ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఈ నెల 24న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి బంగారం అన్వేషణ మొదలు కానుంది. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో దాదాపు రూ.400 కోట్లతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది.
* దాదాపు 600 ఎకరాల్లో..
ప్రధానంగా జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో విస్తరించి ఉన్న సుమారు 598 హెక్టార్ల లీజు భూమిలో.. ఈ మైనింగ్ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అత్యాధునిక సాంకేతికత, అంతర్జాతీయ ప్రమాణాలతో కేవలం 13 నెలల రికార్డు కాలంలోనే ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి పైలెట్ రన్ పూర్తి చేయగలిగారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా సుమారు నాలుగు లక్షల టన్నుల బంగారు ఖనిజాన్ని ప్రాసెస్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే నిక్షేపాల అంచనాలపరంగా జొన్నగిరి గని దేశీయ పసిడిరంగంలో గేమ్ చేంజర్ గా మారనుంది. ఇప్పటికే ఇక్కడ ప్రాథమిక అన్వేషణ పూర్తయింది. జొన్నగిరి ఓపెన్ ఫిట్ పరిధిలో దాదాపు 13, 100 కిలోల నికార్సైన బంగారు నిల్వలు ఉన్నట్లు జియో లాజికల్ సర్వేలు స్పష్టం చేశాయి.
* నిల్వలు పెరిగే అవకాశం..
అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ బంగారు మైనింగ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏకంగా ఈ చోట 42.5 టన్నుల నుంచి 50 కిలోల వరకు బంగారు నిల్వలు పెరిగే అవకాశం ఉన్నట్లు మైనింగ్ నిపుణులు నిర్ధారిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి సగటున వెయ్యికిలోల శుద్ధి చేసిన విదేశీ ప్రమాణాల బంగారాన్ని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ భారీ ప్రాజెక్టు కొంత సక్సెస్ఫుల్గా కనిపిస్తుండడంతో.. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో ఖనిజ సంపద వెలికితీతను మరింత వేగవంతం చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
