Royal Enfield Tirupati Plant: ఏపీకి ( Andhra Pradesh) పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయి. ఇప్పటివరకు ఐటీ పరిశ్రమలు రాగా.. ఇప్పుడు తయారీ రంగ పరిశ్రమలు ముందుకు రావడం విశేషం.. విశాఖకు ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టేందుకు రిలయన్స్ సైతం సన్నాహాలు మొదలుపెట్టింది. మరోవైపు తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. 2700 వందల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ ముందుకు వచ్చింది. మరోవైపు రాయలసీమలో రెండు లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. వాటికి సంబంధించి అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది.
* ప్రత్యేక స్థానం..
మోటారు వాహన రంగంలో రాయల్ ఎన్ఫీల్డ్ ది( Royal Enfield) ప్రత్యేక స్థానం. 80వ దశకం లోనే ఈ బుల్లెట్ బండి ఒక ఊపు ఊపేసింది. అయితే లేటెస్ట్ వెర్షన్ తో ఇప్పుడు మార్కెట్లో బుల్లెట్ బండ్లు వస్తున్నాయి. కానీ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఇప్పుడు ప్రత్యేకం. జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లో ఈ బుల్లెట్ వాహనం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. అందుకే ఆ కంపెనీ విస్తరణ దిశగా ఆలోచనలు చేస్తోంది. డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి అందించేందుకు కొత్త ప్లాంట్ల తయారీపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా తిరుపతిలో కొత్త ప్లాంట్ పెట్టేందుకు నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టర్ల సదస్సులో స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఆదాయం పెరుగుతుందని.. పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వస్తే రాష్ట్ర ఆదాయం పెరగడమే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు.
* రాయలసీమలో తయారీ రంగం పరిశ్రమలు..
అయితే ఏపీలో ఒక ప్రత్యేక పరిస్థితి కొనసాగుతోంది. ఐటీ పరంగా విశాఖ( Visakhapatnam) హబ్ గా మారుతోంది. రాయలసీమలో మాత్రం తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ముఖ్యంగా తిరుపతిలోని శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో అనుబంధ పరిశ్రమలు కూడా తరలివస్తున్నాయి. రిలయన్స్ సంస్థ లక్ష కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు రావడం శుభ పరిణామం. గతంలో టిడిపి అధికారంలోకి వచ్చిన సమయంలో అనంతపురంలో కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు అయింది. ఇప్పుడు బుల్లెట్ బండ్లకు సంబంధించి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రానుండడంతో సోషల్ మీడియాలో ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. బుల్లెట్ బండిపై చంద్రబాబు ఉన్న ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.