Andhra Pradesh Heatwave Warning: ఏపీలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. రోజురోజుకు పెరుగుతోంది. మార్చి మొదటి వారంలోనే ఇలా ఉంటే.. నడి వేసవిలో ఎలా ఉంటుందో నన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే రెండు రోజులుగా వేకువ జామున చలి ఉంది. కానీ మధ్యాహ్నం మాత్రం ఎండ మండిస్తోంది. ముఖ్యంగా రాయలసీమలో ఎండలు ముదురుతున్నాయి. కోస్తాంధ్రలో ఉక్కపోత ఊపిరి ఆడనివ్వడం లేదు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని.. ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమని అమరావతిలోని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. ఇటీవల వరకు వర్ష హెచ్చరికలకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇకనుంచి ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో ‘ధురంధర్ 2 ‘ కి బయ్యర్స్ కరువు.. కారణం ఏంటంటే!
రాయలసీమ మండిపోనుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెంటీగ్రేట్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎండకు తోడు వేడి గాలులు కూడా వీయనున్నాయి. అయితే గత రెండు రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం కి రహదారులు నిర్మానుష్యంగా మారాయి. అయితే ప్రస్తుతం బంగాళాఖాతంపై ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ద్వారా వర్షం కంటే తేమశాతం పెరగడం వల్ల.. ఉక్క పోతతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విపరీతమైన వేడికి తోడు ఉక్క పోత ఇబ్బంది పెడుతోంది.
రానున్న మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడనున్నాయి. ఉత్తరకొస్తాతో పాటు యానంలో ఈరోజు రేపు పొడి వాతావరణం ఉంటుంది. అక్కడక్కడ పొగ మంచు కురవనుంది. ఆదివారం మార్చి 8న అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమలో ఎటువంటి ప్రభావం ఉండదు. మిగతా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి కొనసాగుతుంది.