Andhra Pradesh AI Investment Deals: ఏపీకి( Andhra Pradesh) పెట్టుబడులు భారీగా తరలివస్తున్నాయి. ఇప్పటికే చాలా సంస్థలు వచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. తాజాగా ప్రపంచంలోని ఏడు దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ సమ్మిట్ కు హాజరయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో క్వాంటం, ఏఐ టెక్నాలజీ విస్తరణ లక్ష్యంగా.. విద్యార్థులకు యువతకు కొత్త సాంకేతిక శిక్షణ ఇచ్చేందుకు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి. తద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగాలే లక్ష్యంగా ఈ ఒప్పందాలు జరిగాయి. ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేందుకు ఇవి దోహదపడనున్నాయి.
* చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు..
ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో( AI impact submit ) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా ఐటి దిగ్గజాలు రావడం విశేషం. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్, ఐబీఎం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి, భారత్ జెన్- నక్స్ జెన్ – ఐబీఎం, కాలిబో ఏఐ, వైజర్,, ఐఐటి మద్రాస్ లతో ఒప్పందాలు జరిగాయి. సీఎం చంద్రబాబు సమక్షంలో ఇరుపక్షాలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాష్ట్రంలో ఏఐ, క్వాంటం వ్యాలీ అభివృద్ధికి, అనుకూల వాతావరణం పెంచడానికి ఈ ఏడు ఒప్పందాలు దోహదపడతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
* క్వాంటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యుఎన్ఐసిసి తో ఒప్పందం చేసుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఏఐ క్వాంటం ఎక్సలెన్సు సెంటర్ ఏర్పాటు చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
* లక్షలాదిమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం. క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో రాష్ట్రంలోని లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో ఐబీఎం విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది.
* మరోవైపు క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్ ఐ ఈ ఎల్ ఐ టి తో ఒప్పందం జరిగింది.
* ఏఐ స్టాక్ నిర్మాణానికి భారత్ జెన్- నక్స్ జెన్ – ఐబీఎం లతో ఒప్పందం జరిగింది.
* 50 ఉన్నత విద్యాసంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీ విస్తరణకు కాలిబోతో ఒప్పందం జరిగింది.
* అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం వైజర్ తో ఒప్పందం జరిగింది.
* ఏఐ ట్యూటర్ కోసం ఐఐటీ మద్రాస్ తో ఒప్పందం చేసుకుంది ఏపీ ప్రభుత్వం.