Vemuri Radhakrishna Apology: ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ జన్మదినం. ఆయన సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్ లలో రాధాకృష్ణ ఫోటోలు పెట్టుకుని.. యజమాని పట్ల తమ ప్రేమ భావాన్ని చాటుకున్నారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. లైకులు.. కామెంట్లు సొంతం చేసుకున్నారు. తన పుట్టినరోజు నాడు ఎంతో గొప్పగా వేడుకలు జరుపుకోవాల్సిన రాధాకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకంగా క్షమాపణ చెప్పారు.. సహృదయంగా గమనించాలని.. తన పత్రికలో గమనిక కూడా వేశారు.
ఆంధ్రజ్యోతి పత్రికలో శుక్రవారం సంచికలో “ఆఎంపీని టార్చర్ చేస్తారని”తాటికాయ పరిమాణంలో అక్షరాలతో బ్యానర్ వార్త ప్రచురితమైంది. ఇదంతా కూడా సునీల్ నాయక్ అనే అధికారికి ముందే తెలుసు అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అయితే ఈ కథనం రాసే క్రమంలో రిపోర్టర్ సక్రమంగానే వ్యవహరించాడు. కానీ సెంట్రల్ డెస్క్ లోనే సీనియర్ సబ్ ఎడిటర్లు దారి తప్పారు.. కనీసం ఫైనల్ కాపీ కూడా చూసుకోకుండా.. హడావిడిగా సునీల్ నాయక్ ఫోటో వేశారు. ఇంతకీ ఆ ఫోటో బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ ఫోటో కాదు. ఆస్థానంలో మరో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఫోటో వేశారు. కథనం మాత్రం సునీల్ కుమార్ నాయక్ దే. ఫోటో మాత్రం పీవీ సునీల్ కుమార్ ది.
ఉదయాన్నే తన ఫోటో చూసుకొని కుమార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్టున్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక దివాలా కోరుతనాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేసినట్టున్నారు. అందువల్లే ఆంధ్రజ్యోతి పత్రిక శనివారనాటి ఏపీ ఎడిషన్ లో గమనిక పేరుతో చిన్నపాటి డిస్క్లైమేర్ ప్రచురించింది. అది కూడా మూడో పేజీలో.. బ్యానర్ వార్తను తాటికాయ పరిమాణంలో అక్షరాలతో ఫస్ట్ పేజీలో పబ్లిష్ చేశారు. గమనికను మాత్రం మూడో పేజీలో ఏదో వేసి వేయనట్టుగా.. జరిగిన దాంట్లో తన తప్పు ఏమీ లేనట్టుగా ప్రచురించింది.
వాస్తవానికి ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్ ను గాలికి వదిలేసారా.. అందులో ఉపసంపాదకులు పనిచేయడం లేదా.. సీనియర్ ఉద్యోగులకు బాధ్యత లేదా.. రాసిన వాళ్లకు అవగాహన లేదా.. అసలు ఏం చేస్తున్నారు.. బ్యానర్ వార్తలో ఫోటో మారిపోతే దానికి బాధ్యులు ఎవరు.. ఇంతటి వార్తలో పీవీ సునీల్ కుమార్ ఫోటో వేశారంటే ఆ బాధ్యతారాహిత్యాన్ని ఏమనుకోవాలి.. ఇదిగో ఇలానే ఏపీ పాఠకులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి రాధాకృష్ణ ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది. అన్నట్టు ఎదురు వ్యక్తుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫస్ట్ పేజీలో వేసే రాధాకృష్ణ.. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇలా చూసి చూడనట్టు.. కనిపించి కనిపించినట్టు.. వార్తలు ప్రచురించడం నిజంగా గొప్ప విషయం.
