Anchor Syamala : యాంకర్ శ్యామలను ఆదుకున్న జగన్.. రోజాతో సమాన పదవి!

ఏపీలో కూటమి గెలిచిన తర్వాత ఎక్కువగా ట్రోల్ అయ్యారు యాంకర్ శ్యామల.ఆమె కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ జగన్ ఆమెకు పొలిటికల్ కెరీర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీ అధికార ప్రతినిధిగా నియమించారు.

Written By: Dharma, Updated On : September 14, 2024 10:54 am

Anchor Syamala

Follow us on

Anchor Syamala : ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఆ పార్టీకి దిగ్భ్రాంతి కరమైన ఓటమి ఎదురైంది. దీంతో పార్టీకి భవిష్యత్తు లేదనుకుంటున్న నేతలు పార్టీని వీడుతున్నారు.ఇప్పటికే చాలామంది సీనియర్లు,మాజీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్యేలు వలస బాట పట్టారు.మరి కొంతమంది ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. కౌంటింగ్ అనంతరం విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించారు.ప్రతి జిల్లా నుంచి నేతలు పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్సీలు కర్రీ పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, పోతుల సునీత పార్టీకి గుడ్ బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు సైతం రాజీనామా చేశారు. అదే సమయంలో చాలా జిల్లాలకు చెందిన అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు సైతం పార్టీని వీడుతున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వారి స్థానంలో కొత్త వారితో భర్తీ చేయాలని జగన్ భావిస్తున్నారు. కొత్త టీం తో ముందడుగు వేయాలని చూస్తున్నారు. పలువురికి పార్టీ పదవులు కట్టబెట్టారు.

* కొత్త అధికార ప్రతినిధులు వీరే
తాజాగా పార్టీలో నలుగురు కొత్త అధికార ప్రతినిధులను నియమించారు.మాజీ మంత్రి ఆర్కే రోజా,మాజీ ఎమ్మెల్యే భూమనా కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్ రావు లను అధికార ప్రతినిధులుగా ప్రకటించారు. వీరితోపాటు ప్రముఖ యాంకర్ శ్యామలకు సైతం ఈ జాబితాలో చోటు దక్కింది.అయితే మొదటి ముగ్గురు నియామకం ఆశ్చర్యపరచకపోయినా.. యాంకర్ శ్యామలను మాత్రం నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

* వైసీపీకి వెన్నుదన్నుగా
మొన్నటి ఎన్నికల్లో శ్యామల వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు.ఎన్నికలకు ముందే వైసిపిలో చేరారు.అయితే వైసీపీకి మద్దతు నిలవడం తప్పులేదు కానీ.. ఆమె రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె ఇంటర్వ్యూలు కొన్ని వివాదాస్పదం అయ్యాయి.అదే ఇప్పుడు ఆమె కెరీర్ కు ఇబ్బంది తెచ్చిపెట్టాయి.అవకాశాలు లేక, రాజకీయాల్లో కొనసాగలేక ఆమె సతమతమవుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆమెకుఏకంగా పార్టీ అధికార ప్రతినిధి హోదా కల్పించడం విశేషం.

* వివాదాలు తెచ్చుకుని..
ఈ ఎన్నికల్లో ఆమె మంగళగిరి,పిఠాపురంలో ప్రచారం చేశారు.లోకేష్, పవన్ లకు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారని కూడా వ్యాఖ్యానించారు. జనసైనికుల ఆగ్రహానికి గురయ్యారు. టిడిపి కూటమి గెలిచాక సోషల్ మీడియాలో టార్గెట్ అయ్యారు. అయితే తాను ఎవరిపై వ్యాఖ్యలు చేయలేదని.. తనకు రాజకీయాలతో సంబంధం లేదన్నట్టు శ్యామల ప్రకటించారు. కానీ ఇప్పుడు ఏకంగా వైసిపి అధికార ప్రతినిధి జాబితాలో ఆమె పేరు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకనుంచి ఆమె రాజకీయ ప్రయాణం మొదలు పెడతారని తెలుస్తోంది.