Amaravati Capital Controversy YSR Congress: వైఎస్ఆర్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఎవరో నష్టం చేయాల్సిన పనిలేదు. తన సెల్ఫ్ గోల్ తానే వేసుకుంటూ ఉంటుంది. అది చాలా సందర్భాల్లో చూశాం కూడా. రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి గొప్ప అవకాశం ఇచ్చారు. కానీ దానిని కాపాడుకోలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి తప్పిదమే అది. వైసిపి హయాంలో మంత్రులుగా ఒక 50 మంది వరకు పనిచేశారు. అయితే అప్పట్లో శాఖలపై మాట్లాడేవారు కాదు వాళ్ళు. వాళ్ల మాటలు ఎక్కువగా నష్టం చేకూర్చాయి. ఇప్పుడు కూడా అవే మాటలు ఆడుతున్నారు వాళ్లు. మొన్నటి ఎన్నికల్లో అమరావతికి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచినందుకే ప్రజలు ఆగ్రహించారు. ఆ విషయం తెలియక పదే పదే అమరావతి పై మాట్లాడుతునే ఉన్నారు. అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో కూడా విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు.
* రాజధానులు మార్పు ఉండాలంటున్న ధర్మాన
ధర్మాన ప్రసాదరావు( dharmana Prasad Rao ) లాంటి రాజకీయ ఉద్దండుడు అమరావతికి కొత్త భాష్యం చెబుతున్నారు. రాజధానుల మార్పు అనేది ప్రజల చేతుల్లో ఉండాలని.. గతంలో మద్రాస్ నుంచి కర్నూలు.. కర్నూలు నుంచి హైదరాబాద్ రాజధానిల మార్పును గుర్తు చేస్తున్నారు. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ రాజధానుల మార్పును సమర్ధించుకుంటున్నారు. అమరావతికి చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నారు. ఒక సీనియర్ మోస్ట్ లీడర్ గా రాజధానుల మార్పు ఏ సందర్భంలో జరిగింది అనే విషయం ధర్మాన ప్రసాదరావుకు తెలుసు. కానీ నవ్యాంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని ఎంపిక చేసి అభివృద్ధి చేశారని.. దానిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్పు చేసిందన్న విషయం ధర్మానకు తెలియదా? ఆయన అలాంటి వ్యాఖ్యానాలు చేయడం మాత్రం ముమ్మాటికి తప్పిదమే.
* కాల్చేయండి అంటూ కామెంట్స్..
సిదిరి అప్పలరాజు( appala Raju ) మరోలా మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకారం ఇంకా కొనసాగిస్తున్నారు. అధికారం కోల్పోయామన్న విషయాన్ని కూడా ఆయన మరిచిపోయి ఉన్నట్టు ఉన్నారు. రాష్ట్ర సంపదను అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్న వారిని కాల్చేయాలని పిలుపునిస్తున్నారు. ఇలాంటి కఠినమైన మాటలతో అమరావతికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అనే సంకేతం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది కూడా. వైయస్సార్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాజధానులను కచ్చితంగా మార్పు చేస్తుందన్న భయం కూడా ఉంటుంది. అది అంతిమంగా ఆ పార్టీకి డ్యామేజ్ చేస్తుంది. ఇక మరో నేత బొత్స అయితే ఈ చట్టబద్ధత బిల్లు చెల్లదని చెబుతున్నారు. బహుశా శాసనసభలో తీర్మానం చేసి.. శాసనమండలిలో బిల్లు ప్రవేశ పెట్టకపోవడం వల్లే ఆయన ఈ భావనకు వచ్చి ఉండవచ్చు. కానీ గతంలోనే బొత్స చేసిన వ్యాఖ్యలతో ఆయన అమరావతికి బద్ధ వ్యతిరేకి అని ముద్ర పడింది. గతంలో అమరావతిని స్మశానంతో పోల్చారు ఈ సీనియర్ నేత. ఇప్పుడు చట్టబద్ధత సైతం చెల్లదని చెప్పడం ద్వారా ప్రజల ఆగ్రహానికి వైసిపి గురికాక తప్పదు.
* ఉత్తరాంధ్ర నేతలతోనే..
అయితే ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కేవలం ఉత్తరాంధ్ర నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇది వ్యూహాత్మక ఎత్తుగడగా అనిపిస్తుంది. ఇప్పటికే విశాఖలో పాలన రాజధానిని ఉత్తరాంధ్ర ప్రజలు విశ్వసించలేదు. ఆహ్వానించలేదు కూడా. కానీ ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన నేతలతో అమరావతి పై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే అది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేయడం ఖాయం. ఇప్పటికే అమరావతి తో ఆ పార్టీ చేతులు కాల్చుకుంది. అయినా సరే గుణపాఠాలు నేర్చుకోకపోవడం ఆ పార్టీకి లోటు..
